రాష్ట్రవ్యాప్త బంద్ హింసాత్మకం- అట్టుడుకుతున్న బీహార్: రాళ్ల దాడులు, టియర్ గ్యాస్ ప్రయోగాలు
దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన నీట్ పరీక్షా పత్రాల లీకేజీ వ్యవహారం బీహార్లో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. వివిధ విద్యార్థి సంఘాలు, వామపక్ష విద్యార్థి సంఘాలు ఏఐఎస్ఏ, ఆర్ వై ఏతో పాటు ప్రతిపక్ష పార్టీల మద్దతుతో బుధవారం పిలుపునిచ్చిన బీహార్ బంద్ హింసాత్మకంగా మారింది. ఈ ఆందోళనల సందర్భంగా పలు జిల్లాల్లో నిరసనకారులు రోడ్లను దిగ్బంధించి, ఆర్టీసీ బస్సులను అడ్డుకున్నారు. పలుచోట్ల రహదారులపై టైర్లు తగలబెట్టారు.
బీహార్ రాజధాని పాట్నాలో నిరసనకారులు పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చారు. గాంధీ మైదాన్, జేపీ గోలంబర్, రామ్ గులాం చౌక్ వద్దకు వందలాది మంది విద్యార్థులు, వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు గుమికూడారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సచివాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించగా.. పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో వాగ్వివాదం చెలరేగింది. ఘర్ఝణలకు దారి తీసింది.

పోలీసు వాహనాలపై ఆందోళనకారులు దాడులకు పాల్పడ్డారు. ఈ ఘటనలో పలు వాహనాలు ధ్వంసం అయ్యాయి. వాటి అద్దాలు పగిలాయి. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. టియర్ గ్యాస్ ను ప్రయోగించారు. పలు విద్యార్థి సంఘాల నాయకులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఆందోళనలకు రాష్ట్రీయ జనతా దళ్ మాజీ నాయకుడు తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా హాజరయ్యారు. పాట్నాలోని గాంధీ మైదానంలో నిరసనకారులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యార్థుల హక్కుల కోసం ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న అమాయక విద్యార్థులపై పోలీసులు దారుణంగా లాఠీచార్జ్ చేయడాన్ని ఆయన తప్పుపట్టారు.
ఈ బంద్ సందర్భంగా ఛప్రా, సివాన్ జిల్లాల్లో తీవ్ర హింస చోటుచేసుకుంది. ఛప్రాలో రోడ్లపై బైఠాయించారు. జాతీయ రహదారిని దిగ్బంధించారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులపై ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు. దీంతో అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. పరిస్థితిని అదుపు చేయడానికి పోలీసులు లాఠీచార్జ్ చేశారు. సివాన్ జిల్లాలో కూడా ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. నిరసనకారులు ప్రభుత్వ ఆస్తులపై దాడి చేసి ధ్వంసం చేయడంతో యంత్రాంగం అదనపు పోలీసు బలగాలను మోహరించింది.
గయ, సహర్సా, సమస్తీపూర్, ఆరా జిల్లాల్లో కూడా ఈ నిరసన సెగ తాకింది. ఆరా జిల్లాలో నిరసనకారులు జాతీయ రహదారులను స్తంభింపజేసి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రీయ విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాల ప్రతినిధులు డిమాండ్ చేశారు. ఎక్కడికక్కడ అవాంఛనీయ సంఘటనలను అడ్డుకోవడానికి పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. శాంతిభద్రతలను కాపాడే క్రమంలో బీహార్ వ్యాప్తంగా రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రభుత్వ కార్యాలయాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు.












Click it and Unblock the Notifications