దేశాన్ని నడిపించే నాయకుడికి గట్స్ ఉండాలి: ప్రియాంక గాంధీ
కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాపై అఖిల భారత కాంగ్రెస్ కమిటీ ప్రధాన కార్యదర్శి, వాయనాడ్ లోక్ సభ సభ్యురాలు ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ ఘనత.. కాక్రోచ్ జనతా పార్టీకే దక్కుతుందని వ్యాఖ్యానించారు. యువత, విద్యార్థిలోకం ఐక్యంగా ఉద్యమించడం వల్లే కేంద్ర ప్రభుత్వం దిగొచ్చిందని పేర్కొన్నారు. ఈ పని ఎప్పుడో చేసి ఉండాల్సిందని అన్నారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు గుప్పించారు.
దేశంలో ప్రస్తుతం నెలకొన్న నిరుద్యోగ సమస్య పరిష్కారంలోనూ, యువత, విద్యార్థుల ఆవేదనలను ఆలకించడంలోనూ కేంద్రం విఫలమైందని ఆరోపించారు. దేశాన్ని సరైన మార్గంలో నడిపించే నాయకుడికి ధైర్యం, తెగువ, బాధ్యతాయుత ప్రవర్తన అత్యంత అవసరమని, ప్రధాని మోదీ ఎప్పుడే గానీ వీటిని ప్రదర్శించలేదని గుర్తు చేశారు. ఆ నాయకత్వ లక్షణాలను ప్రదర్శించాల్సిన సమయం ఆసన్నమైందని ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు.

ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంలో నెలకొన్న జాప్యం, ఇన్ని రోజులూ కేంద్రం అనుసరించిన మొండి వైఖరి వల్ల దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని, చివరికి తమ ప్రాణాలను పణంగా పెట్టి ఢిల్లీలో ఈ స్థాయిలో ఆందోళన చేయాల్సి వచ్చిందని అన్నారు. పోటీ పరీక్షల నిర్వహణలో జరుగుతోన్న పేపర్ లీకేజీలు, ఇతర అవకతవకలపై విద్యార్థులు సుదీర్ఘ కాలంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ ఇన్నాళ్లూ పాలకులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు.
ప్రజాస్వామ్య దేశంలో పాలకులకు ప్రజల పట్ల, ముఖ్యంగా యువత పట్ల జవాబుదారీతనం ఉండాలని ప్రియాంక గాంధీ అన్నారు. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం, ఉపాధి అవకాశాల కోసం శాంతియుత మార్గాల్లో నిరసనలు తెలుపుతున్నప్పుడు వారి గొంతును నొక్కేయడానికి ప్రయత్నించడం ఏమాత్రం తగదని హితవు పలికారు. నిజమైన నాయకత్వం అంటే ఎన్నికల వేదికలపై సుదీర్ఘ ఉపన్యాసాలు ఇవ్వడం కాదని, ప్రజా కష్టాలను ప్రత్యక్షంగా ఆలకించి వాటికి తగిన పరిష్కారాలు చూపడమేనని ఆమె వ్యాఖ్యానించారు.












Click it and Unblock the Notifications