12 ఏళ్ల మోదీ పాలనలో ఫస్ట్ టైమ్.. చరిత్ర సృష్టించిన యువత ఆక్రోశం
యువత ఆక్రోశానికి కేంద్రం దిగివచ్చింది. జెన్ జీ దెబ్బకి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. నీట్ (NEET-UG) పరీక్షా పత్రాల లీకేజీ కుంభకోణం, దేశవ్యాప్తంగా రేగిన విద్యార్థుల నిరసన జ్వాలల నేపథ్యంలో కేంద్ర రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. గత కొద్ది రోజులుగా దేశరాజధానితో పాటు అన్ని రాష్ట్రాల్లో ఉధృతంగా సాగుతున్న ఆందోళనల తీవ్రతకు కేంద్రం దిగిరాక తప్పలేదు.
నీట్ లీకేజ్ వివాదానికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం తన పదవికి హఠాత్తుగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపుతూ.. గందరగోళంలో ఉన్న కోట్లాది మంది విద్యార్థులు, యువత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే 12 ఏళ్ల మోదీ ప్రభుత్వంలో తొలిసారిగా ఒక భారీ నిరసన ద్వారా ఒక కేంద్రమంత్రి రాజీనామా చేయడం ఎన్డీఏ చరిత్రలోనే తొలిసారి జరిగిన కీలక పరిణామం.

'మా పోరాటానికి దక్కిన తొలి విజయం': సీజేపీ సంచలన వ్యాఖ్యలు
కేంద్ర మంత్రి రాజీనామా పరిణామంపై 'కాక్రోచ్ జనతా పార్టీ' (సీజేపీ) వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే తక్షణమే స్పందించారు. ఈ రాజీనామా తమ ఉద్యమానికి దక్కిన చారిత్రాత్మక విజయమని ఆయన కొనియాడారు. "మనం సాధించాం.. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు! అధికార పక్షాల బెదిరింపులకు భయపడకుండా, లొంగకుండా ఎదురు తిరిగి పోరాడితే ఎంతటి వారైనా దిగిరాక తప్పదని ఈ పరిణామం నిరూపించింది" అని దిప్కే వ్యాఖ్యానించారు.
ఇంకా మిగిలున్న డిమాండ్లు..
మంత్రి రాజీనామా తమ మొదటి డిమాండ్ మాత్రమేనని, నీట్ మానసిక ఒత్తిడితో ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు రూ. 1 కోటి నష్టపరిహారం అందించడం, ఆందోళన బాటపట్టిన విద్యార్థులపై ఎలాంటి కేసులు పెట్టకపోవడం అనే మిగిలిన రెండు డిమాండ్ల నెరవేర్చే వరకు తమ పోరు ఆగదని అభిజీత్ దిప్కే స్పష్టం చేశారు.
The Cockroach Janta Party Demands Update:
— Cockroach Janta Party (@CJP_for_India) July 25, 2026
1. Dharmedra Pradhan must resign ✅
2. 1 crore to the families of all students who died by suicide - PENDING
3. No action against any of the student protesters - PENDING
: CJP Chief
బాధ్యత నుంచి నేను తప్పుకోలేదు: నిష్క్రమణ వేళ ప్రధాన్ ఆవేదన
రాజీనామా లేఖలో ధర్మేంద్ర ప్రధాన్ తన సుదీర్ఘ రాజకీయ విద్యా ప్రస్థానాన్ని గుర్తుచేసుకుంటూ భావోద్వేగానికి గురయ్యారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఉపాధ్యాయులు, విద్యార్థులు, విద్యా వ్యవస్థ సంస్కరణలతో తనకు అవినాభావ సంబంధం ఉందన్నారు. మే 3న జరిగిన నీట్ పరీక్షల్లో అక్రమాలు వెలుగులోకి రాగానే సీబీఐ విచారణకు ఆదేశించామని, పరీక్షను రద్దు చేసి మళ్లీ నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని చెప్పారు. విద్యార్థుల ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండేందుకే వచ్చే ఏడాది నుంచి సీబీటీ పద్ధతిలో పరీక్షలు జరపాలని ప్రాథమిక నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ క్లిష్ట సమయంలో ఏ ఒక్క అర్హుడైన విద్యార్థికి అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతోనే బాధ్యతయుతంగా వ్యవహరించి పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
చీఫ్ జస్టిస్ కు కృతజ్ఞతలు
ఈ పోరాటానికి మూలమైన సుప్రీం ప్రధాన న్యాయమూర్తికి అభిజీత్ దిప్కే కృతజ్ఞతలు తెలిపారు. ఆయన ఉపయోగించిన కాక్రోచ్ పదమే ఇవాళ కేంద్ర మంత్రి రాజీనామా చేయాలనే మహోద్యమానికి ప్రాణం పోసిందని పేర్కొన్నారు. మీరు లేకుంటే ఇంతటి ఘన విజయం సాధ్యం కాదని ఎక్స్ లో రాసుకొచ్చారు












Click it and Unblock the Notifications