ఏపీలో ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్..! 10 శాతం జీతాల పెంపు..!
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులు (Employees) కూటమి సర్కార్ (Ap Govt) తమకు ఇచ్చిన హామీల అమలు కోసం రెండేళ్లుగా ఎదురుచూస్తున్నారు. ఇందులో బకాయిల చెల్లింపు, పీఆర్సీ అమలు సహా పలు పెండింగ్ అంశాలు ఉన్నాయి. అయితే వీటితో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ఓ శాఖకు సంబంధించిన ఉద్యోగులకు జీతాలు పెంచుతూ (Salaries hike) ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రెండేళ్లుగా వారి పనితీరు ఆధారంగా 10 శాతం జీతాలు పెంచాలని నిర్ణయించింది.
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో ఉన్న లేపాక్షి (lepakshi) షో రూమ్ ల్లో పనిచేస్తున్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రస్తుతం అందుతున్న మూల వేతనాలపై అదనంగా పది శాతానికి పైగా జీతాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత లేపాక్షి ఉద్యోగులకు శుభ వార్త తెలిపారు. ఇవాళ మంత్రిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లేపాక్షి షో రూమ్ ల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు కలిసి, పలు సమస్యలతో కూడిన వినతి పత్రాలు ఇచ్చారు. గడిచిన రెండేళ్ల నుంచి అమ్మకాలు పెంచినట్లు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.

అనంతరం మంత్రి సవిత స్పందిస్తూ, లేపాక్షి షో రూమ్ ల్లో 2024-25లో రూ.56.47 కోట్లు, 2025-26లో రూ.60.75 కోట్ల మేర అమ్మకాలు జరపడంపై ఆనందం వ్యక్తంచేస్తూ ఉద్యోగులను అభినందించారు. పెరిగిన అమ్మకాలను దృష్టిలో పెట్టుకుని ఆయా ఉద్యోగుల స్థాయిని బట్టి 10 శాతానికి పైగా జీతాలు పెంచుతున్నట్లు అక్కడికక్కడే ప్రకటించారు. ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనూ రూ.80 కోట్లకు అమ్మకాలు పెంచాలని దిశా నిర్దేశం చేశారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 19 లేపాక్షి షో రూమ్ లు ఉన్నాయన్నారు. త్వరలో రాజమండ్రి ఎయిర్ పోర్టులో నూతన షో రూమ్ ను ఏర్పాటు చేయబోతున్నామన్నారు.














Click it and Unblock the Notifications