అనకాపల్లి నూకాంబిక ఆలయంలో అద్భుతం...ఈ గుడి చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి!
విశాఖ జిల్లా:హిందూ మతంలో దేవాలయాలకు అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ క్రమంలోనే కొన్ని దేవాలయాలకు వాటికి ఉన్న విశిష్టతల దృష్ట్యా ఆ ప్రాధాన్యత అంతకంతకూ పెరుగుతూ ఉంటుంది.
అలాగే కొన్ని ప్రత్యేక సందర్భాల సమయంలో సాధారణ ఆలయాలకు సైతం అమిత ప్రాధాన్యం ఏర్పడటం కద్దు. ఇవన్నీ ఒక క్రమమైతే ఇందుకు భిన్నంగా కొన్ని ఆలయాల్లో అనూహ్యంగా చోటు చేసుకునే మహిమల కారణంగా ఆయా ఆలయాలకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుంది. ఈ ఉపోద్ఘాతమంతా దేనికంటే... ఇప్పుడు అలాంటి అద్భుతమే విశాఖ జిల్లా అనకాపల్లి నూకాంబిక ఆలయంలో చోటు చేసుకుంది. ఈ ఆలయం చరిత్రలో ఎన్నడూ జరగని వింత సంభవించింది. అదేమిటంటే?...

ఉత్తరాంధ్రలో ప్రఖ్యాతిగాంచిన అనకాపల్లి నూకాంబిక అమ్మవారి విగ్రహాన్ని తొలిసారిగా సూర్యకిరణాలు తాకాయి. మంగళవారం ఉదయం 6.39 గంటలకు ఈ అద్భుతం చోటుచేసుకుంది. సూర్యకిరణాలు రాజగోపురం మీదుగా ప్రయాణిస్తూ ఈ ఆలయంలో నిలువెత్తున కొలువై ఉన్న అమ్మవారి విగ్రహంపై పడడంతో భక్తులు తొలుత సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు....ఆ తరువాత భక్తిపారవశ్యంలో తేలియాడారు.
అయితే ఇలా జరగడం ఆ ఆలయం చరిత్రలో ఇదే ఓంప్రథమమని నిర్వాహకులు చెబుతున్నారు. అమ్మవారితో పాటు తమకు సూర్యభగవానుడి కరుణ లభించిందని, ఈ ఆనందం వర్ణనాతీతమని సంతోషం వెలిబుచ్చారు. ఇలా విగ్రహానికి సూర్య కిరణాలు తాకడం వల్ల ఆ విగ్రహానికి కొత్త శక్తులు వస్తాయని చెబుతున్నారు. అందుకు దృష్టాంతంగా అరసవెళ్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం ప్రత్యేకతను గుర్తుచేస్తున్నారు.
శ్రీకాకుళం జిల్లా అరసవెళ్లిలో ఉండే సూర్యనారాయణ స్వామి దేవాలయంలో ఏడాదికి రెండు సార్లు సూర్య కిరణాలు ఉదయం, సాయంత్ర సమయంలో గర్భగుడిలో ఉన్న మూలవిరాట్టు పాదాలను తాకుతాయి. ఆ సమయంలో లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడికి వస్తుంటారు. ప్రతి ఏటా మార్చి 9, 10,11, 12 తేదీల్లో అదే విధంగా అక్టోబర్ 1,2,3,4 తేదీల్లో స్వామివారిని భానుడి తొలికిరణాలు తాకుతాయి.
అయితే అరసవెళ్లిలో సూర్యనారాయణ స్వామిని ఇంకా ఆదిత్యుడు తాకకముందే ఇక్కడ అమ్మవారి ఆలయంలో ఈ రకమైన ఘటన చోటుచేసుకోవడం నిజంగా అద్భుతం అని నిర్వాహకులు అభివర్ణిస్తున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న అమ్మవారి భక్తులతో పాటు పరిసర ప్రాంతల ప్రజలు తండోపతండాలుగా తరలివస్తూ అమ్మవారిని దర్శించుకుని తన్మయత్వం చెందుతున్నారు.












Click it and Unblock the Notifications