కేసీఆర్ చిత్ర పటానికి ఏపీలో పాలాభిషేకం: ఆ నిర్ణయంపై హర్షం..
ఒంగోలు: రాజ్యసభ అభ్యర్థుల ఎంపిక విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ చాకచక్యంగా వ్యవహరించారనే చెప్పాలి. ఇద్దరు బీసీలను రాజ్యసభకు పంపించడానికి ఆయన నిర్ణయం తీసుకోవడంతో.. ఆ సామాజిక వర్గంలో హర్షం వ్యక్తమవుతోంది.
ఇద్దరు బీసీలకు అవకాశం కల్పించడం ద్వారా.. తన బంధువు సంతోష్ కుమార్ విషయంలో వచ్చే విమర్శలను తప్పించుకోగలిగారు కేసీఆర్. బీసీలకు సీట్లు కేటాయించడం ప్రధానంగా హైలైట్ కావడంతో ఆయనపై ప్రశంసలు కురుస్తున్నాయి.

ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లోనూ కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేయడం విశేషం. యాదవ్ అయిన బడుగుల లింగయ్యతో పాటు ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన బండ ప్రకాష్ లను రాజ్యసభ అభ్యర్థులుగా ఖరారు చేయడంతో.. ఏపీలోని యాదవ జేఏసీ హర్షం వ్యక్తం చేసింది.
ఒంగోలు కలెక్టరేట్ వద్దకు భారీ ర్యాలీగా వచ్చిన యాదవ జేఏసీ.. అనంతరం కలెక్టరేట్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలభిషేకం చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ కు అనుకూలంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇప్పటికే ఏపీలోనూ తనకంటూ ఫాలోయింగ్ ఏర్పరుచుకున్న కేసీఆర్ కు రోజురోజుకు అక్కడి వర్గాల నుంచి కూడా మద్దతు పెరుగుతుండటం గమనార్హం.












Click it and Unblock the Notifications