గవర్నర్ పదవి తెలంగాణకేనని యనమల, గీత దూరం..
హైదరాబాద్/న్యూఢిల్లీ: తెలుగుదేశం పార్టీ కోటాలో గవర్నర్ పదవి వస్తే తెలంగాణ వారికి ఇవ్వడమే సబబు అని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం అన్నారు. తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు.. వారు ఫీజులు చెల్లించకుంటే తాము చెల్లిస్తామని చెప్పారు.
శాసన సభలో విపక్ష వైఖరి పైన యనమల మండిపడ్డారు. సభ అంటే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండులోని తన ఇల్లు అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
జగన్కు కొత్తపల్లి గీత దూరమే!
అరకు అభివృద్ధి కోసం తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీలతో కలిసి పని చేయాలనుకుంటున్నట్లు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అరకు పార్లమెంటు సభ్యురాలు కొత్తపల్లి గీత తెలిపారు. తాను ప్రస్తుతం ఏ పార్టీలో చేరడం లేదని చెప్పారు. మంగళవారం ఢిల్లీలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో గీత సమావేశమయ్యారు.
అనంతరం ఓ ఛానల్తో మాట్లాడారు. తనపై అనర్హత వేటు వస్తే టీడీపీ అభ్యర్థిగా మళ్లీ పోటీ చేసి, గెలుస్తానన్నారు. చంద్రబాబుతోనే అరకు అభివృద్ధి సాధ్యమన్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో మహిళలకు చోటు లేదని, ఫేస్బుక్లో తన పైన వచ్చిన అసభ్య పోస్టుల పైన జగన్ స్పందించక పోవడం బాధించిందని ఆమె చెప్పారు. జగన్ ఆదరిస్తారనుకున్నానే గాని అవమానిస్తారనుకోలేదని చెప్పారు.