పన్ను మీద పన్ను లేకుండా.. జీఎస్టీ బిల్లుకు ఏపీ ఆమోదం, జగన్పై విష్ణు ఆగ్రహం
ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. అంతకుముందు ప్రతిపక్ష వైసిపి రైతుల సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చింది. నారా లోకేష్ మంత్రి హోదాలో తొలిసారి
అమరావతి: ఆంధ్రప్రదేశ్ శాసన సభలో ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు జీఎస్టీ బిల్లును ప్రవేశ పెట్టారు. విపక్షాల నిరసన మధ్య ఈ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అనంతరం సభ నిరవధికంగా వాయిదా పడింది.
అంతకుముందు ప్రతిపక్ష వైసిపి రైతుల సమస్యపై వాయిదా తీర్మానం ఇచ్చింది. నారా లోకేష్ మంత్రి హోదాలో తొలిసారి అసెంబ్లీకి వచ్చారు.
సభ ప్రారంభం కాగానే తొలుత ఇటీవల మృతి చెందిన దేవినేని నెహ్రూ సహా పలువురు మాజీ శాసన సభ్యులకు సంతాపం తెలిపారు. అనంతరం జీఎస్టీ బిల్లును యనమల ప్రవేశ పెట్టారు.
ఆందోళన మధ్యే
మరోవైపు, రైతుల సమస్యపై చర్చించారని, తమ వాయిదా తీర్మానంపై చర్చ జరగాలని వైసిపి పట్టుబట్టింది. విపక్షాల నినాదాల మధ్య యనమల జీఎస్టీ బిల్లు ప్రవేశ పెట్టారు. వైసిపి సభ్యులు స్పీకర్ పోడియం వద్దకు వచ్చి రైతులను ఆదుకోవాలని నినాదాలు చేశారు.
ప్రతిపక్షం సహకరించాలని..
ఈ సందర్భంగా యనమల మాట్లాడుతూ.. జీఎస్టీ బిల్లు ప్రయోజనకరమని చెప్పారు. బిల్లును ఆమోదించాల్సి ఉందన్నారు. ప్రతిపక్షం సహకరించాలన్నారు.
విష్ణు ఆగ్రహం
అనంతరం విష్ణు కుమార్ రాజు మాట్లాడారు. జీఎస్టీ బిల్లు ప్రవేశ పెట్టిన సమయంలో వైసిపి సభ్యుల తీరు సరికాదన్నారు. స్పీకర్ పోడియం చుట్టుముట్టడం సరికాదన్నారు. దేశ్యాప్తంగా జీఎస్టీ బిల్లును సమర్థించారన్నారు. బయటనేమో మద్దతిస్తామని చెబుతారని, లోపలకు వచ్చి గొడవ చేయడం ఏమిటని ప్రశ్నించారు.
పన్ను మీద పన్ను లేకుండా: చంద్రబాబు
ఒకే దేశం... ఒకే పన్ను విధానాన్ని ఎన్డీయే ప్రభుత్వం తీసుకు వస్తోందని సీఎం చంద్రబాబు అన్నారు. పన్నులపై పన్నులు లేకుండా జీఎస్టీ విధానం ఉపయోగపడుతుందన్నారు. ఆర్థిక సంస్కరణల తర్వాత ఇది మరో విప్లవం అన్నారు.