ఆ లెక్క చూసే వైసీపీ నేతల రాజీనామా, అదో పెద్ద జోక్: జైట్లీపై యనమల
అమరావతి: కేంద్రమంత్రి అరుణ్ జైట్లీపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆదివారం తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారు. 2019 ఎన్నికలు సుస్థిర, అరాచక కూటముల మధ్య పోటీ అనడం పెద్ద జోక్ అని విమర్శించారు.
సుస్థిరత ప్రభుత్వం కోసం ప్రజలు ఇచ్చిన తీర్పును బీజేపీ ప్రభుత్వం కాలరాసిందని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య విలువలకు బీజేపీ తిలోదకాలు ఇచ్చిందని మండిపడ్డారు.

రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటారా?
సీబీఐ, ఈసీ, ఐటీలను బీజేపీ తమ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటోందని యనమల అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సభ కోసం సీఈసీ ఎన్నికల ప్రకటనను వాయిదా వేయడం చాలా దారుణం అన్నారు. రాజ్యాంగ విలువలను కాపాడలేని సుస్థిర ప్రభుత్వాలు ఎందుకని ఆయన ప్రశ్నించారు.

మోడీ విదేశీ పర్యటనలపై అనుమానాలు
ప్రధాని మోడీ విదేశీ పర్యటనలపై ప్రజల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయని యనమల వ్యాఖ్యానించారు. స్వలాభం కోసం నరేంద్ర మోడీ విదేశీ పర్యటనలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. రాఫెల్ కుంభకోణం, కోల్ స్కాం, బ్యాంకుల దివాలా, ఆర్థిక నేరస్థుల పరారీపై మోడీ ఎందుకు మాట్లాడటం లేదని నిలదీశారు.

పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయి
పెట్రోల్ ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు, గ్యాస్ ధరలు చుక్కలను అంటుతున్నాయని యనమల విమర్శించారు. రూపాయి విలువ దారుణంగా పడిపోతోందన్నారు.

ఆ లెక్క చూసి వైసీపీ నేతల రాజీనామా
వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల రాజీనామా డ్రామా అని అధికారికంగా ఇప్పుడు ధ్రవీకరించబడిందని యనమల అన్నారు. సార్వత్రిక ఎన్నికలకు ఏడాదిలోపు వైసీపీ నేతలు తమ ఎంపీ పదవులకు రాజీనామా చేసినందున, ఉప ఎన్నికలు ఉండవని ఈసీ శనివారం వెల్లడించింది. ఈ నేపథ్యంలో యనమల మాట్లాడారు. వైసీపీ మాజీ ఎంపీలు తేదీలు, గంటలు అన్నీ లెక్క చూసే రాజీనామా చేశారని చెప్పారు. ఆ లెక్క మరోసారి కచ్చితంగా చూసిన తర్వాతే లోకసభ స్పీకర్ వాటిని ఆమోదించారన్నారు. ఏడాది కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నికలు రావని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపిందని గుర్తు చేశారు.












Click it and Unblock the Notifications