నీ అర్హత ఏమిటి? : తలసానిని లాగిన జగన్కు యనమల ఘాటు కౌంటర్
2014లో తమ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు.
అమరావతి: 2014లో తమ పార్టీ నుంచి గెలిచి, ఆ తర్వాత టిడిపిలో చేరిన నలుగురు ఎమ్మెల్యేలకు మంత్రి పదవి ఇవ్వడం ప్రజాస్వామ్యమా, ఇది న్యాయమా అని ప్రశ్నించిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్కు మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం కౌంటర్ ఇచ్చారు.
రాజ్యాంగంపై జగన్ మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. 12 ఛార్జీషీట్ల నిందితుడికి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే నైతిక అర్హత ఉందా అని ఎద్దేవా చేశారు. ఇన్ని ఛార్జీషీట్లు ఉండి ప్రతిపక్ష నేతగా ఎవరైనా దేశంలో ఉన్నారా అని అడిగారు.
రాజ్యాంగంపై జగన్కు గౌరవం ఉంటే ఇన్ని కేసులు ఉండి ప్రతిపక్ష నేతగా ఉండటం సరైనదేనా చెప్పాలని నిలదీశారు. నమ్మకద్రోహం, మోసం, మనీలాండరింగ్ అభియోగాలు ఉన్న వ్యక్తి ప్రజాస్వామ్యం, రాజ్యాంగం గురించి మాట్లాడటమా అన్నారు.

ఇలా కౌంటర్
గతంలో తెలంగాణలో టిడిపి నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ వంటి నేతలు తెరాసలో చేరి మంత్రి పదవి పొందారు. దీనిని టిడిపి నేతలు ప్రశ్నించారు. ఇప్పుడు అదే టిడిపి ఏపీలో వైసిపి నుంచి వచ్చిన వారికి పదవులు ఇచ్చింది. దీనిని జగన్ నిలదీశారు.
నాడు మీరు తలసానిని దూషించి, అదే పని చేశారని, ఇదేనా ప్రజాస్వామ్యం అని నిలదీశారు. దీనిపై యనమల... జగన్ పైన ఉన్న కేసుతో కౌంటర్ ఇచ్చారు. అసలు ఇన్ని ఛార్జీషీట్లు ఉన్న వ్యక్తి ప్రతిపక్ష నేతగా అర్హుడా అని నిలదీశారు.

బెట్టు వీడిన చింతమనేని
దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బెట్టు సడలించారు. ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారమే నడుచుకుంటానని తెలిపారు. విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వర రావును ముఖ్యమంత్రి పిలిచి అక్షింతలు వేయడంతో మౌనం వహించారు.

పార్టీ నిర్ణయమే..
పెడన ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు సోమవారం మంత్రులు కళా వెంకట్రావు, దేవినేని, ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడితో వెళ్లి ముఖ్యమంత్రిని కలిశారు. మంత్రిపదవి రాలేదన్న బాధతో కార్యకర్తలు బంద్కు పిలుపునిస్తే వారించానని, పార్టీ నిర్ణయానికే కట్టుబడి ఉంటానని వివరణ ఇచ్చారు. భవిష్యత్తులో అవకాశాలు కల్పిస్తానని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

దూళిపాళ్ల మౌనం
పొన్నూరు ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కూడా మౌనంగా ఉన్నారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి సోమవారం నరేంద్ర ఇంటికి వెళ్లారు. ముఖ్యమంత్రి నిర్ణయానికి కట్టుబడి ఉంటానన్నారు. అనంతపురం జిల్లా పెనుకొండ శాసనసభ్యుడు బీకే పార్ధసారథి కార్యకర్తలతో సమావేశమయ్యారు. జిల్లాకు మరో మంత్రి పదవి వస్తే బాగుండేదన్నారు. కాల్వ శ్రీనివాసులుకి మంత్రి పదవి రావడం మంచిదేనన్నారు. 2019 ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కలసి కృషిచేస్తామన్నారు.

టిడిపిలోనే ఉంటానని శివాజీ
శ్రీకాకుళం జిల్లా పలాస శాసనసభ్యులు గౌతు శివాజీ, ఆయన కుమార్తె, టిడిపి జిల్లా పార్టీ అధ్యక్షురాలు గౌతు శిరీష సోమవారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి పార్టీ పట్ల విధేయత ప్రకటించారు. తండ్రీకుమార్తెలు కన్నీరు పెట్టుకున్నారు. మంత్రివర్గంలో చోటిస్తారనుకున్నానని, రానందుకు బాధపడ్డానని శివాజీ తెలిపారు. టిడిపిలోనే ఉంటానన్నారు.
రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బెట్టు వీడలేదు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి రాజీనామా నిర్ణయానికే కట్టుబడి ఉన్నానని చెబుతున్నారు. ఆయనకు మంత్రి పదవి ఇవ్వనందుకు నిరసనగా టిడిపి కార్పొరేటర్లు 33మందీ సోమవారం రాజమహేంద్రవరం నగరపాలిక పాలకమండలి సమావేశానికి హాజరవలేదు. కోరం లేక సమావేశాన్ని వాయిదా వేశారు. మూడు రోజుల్లోగా బుచ్చయ్యకు న్యాయం చేయకపోతే రాజీనామా చేస్తామని కార్పొరేటర్లు ప్రకటించారు. ఉపముఖ్యమంత్రి చినరాజప్ప సోమవారం బుచ్చయ్య ఇంటికెళ్లి, సముదాయించేందుకు ప్రయత్నించారు. మంత్రి పదవిపై వ్యామోహం లేదని, పార్టీ విధానాలు నచ్చకే రాజీనామా చేశానన్నారు.












Click it and Unblock the Notifications