‘హోదాతో సంబంధం లేదు, రాజకీయ నినాదమే: ప్రజలు, యువత అర్థం చేసువాలి’
ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు రాజకీయ నినాదం అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు.
విశాఖపట్నం: ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు రాజకీయ నినాదం అయిపోయిందని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. శనివారం ఉదయం సీఐఐ సమావేశం ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడారు. హోదా లేకున్నా కూడా పెట్టుబడులు వస్తున్నాయని అన్నారు.
హోదా లేకపోయినా.. తొలి సీఐఐ సదస్సులో రూ.4లక్షల కోట్లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకున్నామని, అందులో రికార్డు స్థాయిలో 40శాతం ఎంవోయూలు కార్యరూపం దాల్చాయని చెప్పారు. అంతేగాక, ప్రత్యేక హోదాకు రాయితీలకు సంబంధం లేదని అన్నారు.
ఈ ఏడాది పరిశ్రమలు ఇంకా ఎక్కువగా వచ్చే అవకాశం ఉందని తెలిపారు. రూ. 10లక్షల కోట్లకు పైగా ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. ఈ సీఐఐ తొలి రోజు సదస్సులో రూ.4.25లక్షల కోట్లకుపైగా ఎంవోయూలు కుదిరాయని, శనివారం రూ.5లక్షల కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరే అవకాశం మందని మంత్రి యనమల చెప్పారు.
హోదా ఉంటేనే పరిశ్రమలు వస్తాయనేది ఏం లేదని.. ఇది ప్రజలు, యువత అర్థం చేసుకోవాలని ఆయన అన్నారు. హోదాకు పరిశ్రమలు రావడానికి సంబంధం లేదని చెప్పారు. ఇప్పటికే లక్ష వరకు ఉద్యోగావకాశాలు కల్పించడం జరుగుతోందని వివరించారు.
దేశం మనవైపు చూస్తోంది: చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి
దేశం మన రాష్ట్రం వైపే చూస్తోందని మంత్రి రావెల కిశోర్ బాబు అన్నారు. సీఐఐ సదస్సులో ఇప్పటికే రూ.4లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంవోయూలు కుదుర్చుకున్నామని తెలిపారు. యువతకు భారీ ఎత్తున ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.
దేశానికి ఆదర్శంగా ఏపీ నిలుస్తోందని అన్నారు. సీఎం చంద్రబాబునాయుడు నాయకత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుంతోందని అన్నారు. రాస్ట్రంలో స్థిర ప్రభుత్వం ఉందని, అన్నింటిపైనా అవగాహన ఉన్న సీఎం రాష్ట్రానికి ఉన్నారని చెప్పారు.