బీజెపీతో పొత్తా..? ఒద్దు బాబోయ్..అంటున్న రాజకీయ పార్టీలు..! ఏపీలో వైసీపి సంకట స్థితి..!
ఆంద్రప్రదేశ్ లో రాజకీయ పార్టీల పరిస్థితి విచిత్రంగా తయారయ్యింది. ఎన్నికలు సమీపిస్తున్నతరుణంలో భవసారూప్యత కలిగిన పార్టీలతో పొత్తుల పొట్టుకుని ఎన్నికల రణరంగంలో దూసుకెళ్లాల్సింది పోయి పొత్తులంటే జడుసుకునే పరిస్థితులు తలెత్తాయి. ముఖ్యంగా భారతీయజనతా పార్టీతో పొత్తు అనగానే మిగిలిన పార్టీలు తుపాకి తూటాకి దొరక్కుండా పారిపోయే పరిస్తితులు నెలకొన్నాయి. భారతీయ జనతా పార్టీతో పొత్తు అంటే రాజకీయ సమాధి తప్పదనే భావన ఏపి రాజకీయ పార్టీలలో బలంగా పాతుకుపోయింది. అంతే కాకుండా ఆంద్ర ప్రజల్లో బీజెపి పట్ల ముద్దాయిగా, శత్రువుగా, విలన్ గా, నమ్మక ద్రోహిగా ముద్ర పడిపోయింది. దాంతో ఆ పార్టీతో పొత్తు అంటేనే కొరివితో తల గోక్కోవడమే అనే భావన వినిపిస్తోంది. ముఖ్యంగా వైసీపి పార్టీకి బీజెపితో అనుబందం శరాఘాతంలా పరిణమించింది.
ఏపిలో పొత్తులపై నెలకొన్న గమ్మైత్తైన పరిణామాలు..!
ఏపిలో వైసీపి పొత్తుపెట్టుకోవడానికి బీజెపి తప్ప మరో ఆప్షన్ లేకపోడంతో వైసీపికి మరింత ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. జగన్ అక్రమాస్తుల కేసునుండి ఉపశమనం పొందాలంటే బీజేపితో మిత్ర దర్మం పాటించాలి., బీజెపితో మిత్రధర్మం పాటిస్తే ప్రజాక్షేత్రంలో ఉనికి కోల్పోయే పరిస్థితులు నెలకొన్నాయి. ఈలాంటి ఉత్కంఠ పరిణామాల మద్య వచ్చే ఎన్నికలను ఎలా ఎదుర్కోవాలా అని వైసీపి నేతలు తలలు పట్టుకుంటున్నారని సమాచారం. అసలు ఏపి రాజకీయాల్లో ఎలాంటి గమ్మత్తైన పరిణామాలు జరుగుతున్నాయి.
గమ్యం తెలియని ప్రయాణాలు..! ఏపి బీజెపి తోనే తలనొప్పులు..!
ఏపీలో ప్రస్తుతానికి చూస్తే అన్ని పార్టీలు కూడా ఒంటరిగానే ఎన్నికల బరిలోకి వెళ్లేందుకే సుముఖత చూపిస్తున్నాయని తెలుస్తోంది. పొత్తుల విషయంలో స్పష్టత రావాలంటే ఇంకా కాస్త సమయం పడుతుందేమో అన్నట్టు పరిస్థితులు ఉన్నాయి. కేంద్రంలోని అధికార పార్టీ బీజేపీ మీద ఏపీలో దాదాపు అన్ని పార్టీలు ఆగ్రహంతోనే ఉన్నాయి. ఆ పార్టీ ఏపీకి చేసిన ద్రోహం గురించి ఇంకా ప్రజలు మరచిపోలేదు. కొంచెం ధైర్యం చేసి ఏ పార్టీ అయినా బీజేపీతో పొత్తు పెట్టుకుంటే ఇక ఆ పార్టీ రాజకీయంగా సమాదికావాల్సిందేననే చర్చకూడా జరుగుతోంది.విపక్షాలు ఏవీ ఒకరితో ఒకరు కలిసే పరిస్థితి లేని విధంగా రాజకీయ వాతావరణం చిక్కుముళ్ల రీతిగా తయారైంది. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో వున్న బీజేపీ అంటే మిగిలిన ఏ పార్టీ కూడా పొత్తుకు సిద్ధపడటం లేదు.
కేంద్రంలో ఎండీయే కి మద్దత్తు తెలిపిన వైసీపి..! ఏపీలో పొత్తుపెట్టుకుంటే ప్రమాదమే..!
ఏపీ జనాల్లో ఆ పార్టీ మీద మెండుగావున్న వ్యతిరేకత తమ కొంప ముంచుతుందని అన్ని పార్టీలు భయపడుతున్నాయి. అయితే ఏపీలో ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వైసీపీ అధినేతకు సన్నిహితుడైన ఓ ఎంపీతో పొత్తు ప్రస్తావన తీసుకువచ్చారని సమాచారం. మొత్తం 175 స్థానాలకు గాను వైసీపీ 100 చోట్ల, జనసేన 60 చోట్ల, బీజేపీ 15 చోట్ల పోటీ చేసేలా అమిత్ షా ఓ ప్రతిపాదన చేసారని తెలుస్తోంది. అయితే అందుకు జగన్ ఒప్పుకోలేదని భోగట్టా! ఈ నేపధ్యంలోనే షా జోక్యంతో కేంద్రం ఈడీ ఛార్జ్ షీట్ లో భారతి పేరు జతచేసిందని అంటున్నారు. అయితే కేసుల గురించి భయపడి బీజేపీతో పొత్తు పెట్టుకుంటే రాజకీయంగా ఏపీలో తుడిచిపెట్టుకుపోవడం ఖాయం అని జగన్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. కాగా మరోవైపు వైసీపీ, బీజేపీ పొత్తు పెట్టుకుంటే ఆ కూటమి విజయం సాధించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే దానిపై పలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మోడీ హవా వైసీపీకి కలిసొస్తుందని కొందరంటున్నారు.
కొన్ని సందర్బాలలో పొత్తు మధురం..! కొన్ని సందర్బాల్లో మధువు..!!
అలాగే బీజేపీతో పొత్తు పెట్టుకుంటే వైసీపీకి వచ్చే కొన్ని సీట్లు కూడా చేజారిపోతాయని మరికొందరు బల్లగుద్ది మరీ చెబుతున్నారు. పైగా ప్రత్యేక హోదా ఇస్తానంటే బీజేపీతో పొత్తు పెట్టుకుంటానని జగన్ ప్రకటించడం పెద్ద తప్పని పలువురు ఆరోపిస్తున్నారు. ఎందుకంటే గతంలో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్న బీజేపీ ప్రత్యేక హోదా హామీని గంగలో కలిపేసిందనే ఆరోపణలున్నాయి. ఈ నేపధ్యంలో బీజేపీకి జగన్ మద్దతు పలికితే జగన్ పై ప్రజలు పెట్టుకున్న నమ్మకం సన్నగిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు.