కుప్పంలో చంద్రబాబు గెలుస్తున్నారా, డౌటా - లెక్క క్లియర్..!?
ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల పైన ఉత్కంఠ పెరుగుతోంది. గెలుపు పైన పార్టీలు...అభ్యర్దులు ధీమాగా కనిపిస్తున్నా..లోలోపల మాత్రం ఆందోళనతో కనిపిస్తున్నారు. గెలిచి తీరుతామంటూ కూటమి నేతలు ప్రకటనలు చేస్తున్నారు. 2019లో గెలిచిన 151 సీట్ల కంటే ఎక్కువ స్థానాలు గెలవబోతున్నామంటూ జగన్ సంచలనానికి కారణమయ్యారు. ఇదే సమయంలో చంద్రబాబు కుప్పంలో గెలుస్తున్నారా..ఓడుతున్నారా అనే చర్చ మొదలైంది.
కొత్త లెక్కలు
ఇప్పుడు ఏపీ ఎన్నికల ఫలితాల పై ఎవరి లెక్కలు వారు చెబుతున్నారు. జగన్ 151 కంటే ఎక్కువ సీట్లు గెలుస్తామని చెప్పటంతో ఇందులో నిజమెంత అనే చర్చ మొదలైంది. తాజాగా వైసీపీ ముఖ్య నేత సజ్జల కుప్పంలోనూ తమ పార్టీ గెలుస్తుందంటూ కీలక వ్యాఖ్యలు చేసారు. 2019 ఎన్నికల సమయంలోనే వైసీపీ కుప్పం పైన ఫోకస్ చేసింది. ఆ ఎన్నికల కౌంటింగ్ లో తొలి రెండు రౌండ్లలో చంద్రబాబు వెనుకంజలో ఉన్నారు. తరువాత పుంజుకొని విజయం సాధించారు. ఈ సారి ఎన్నికల కోసం వైసీపీ కుప్పంలో చాలా కాలంగా పక్కా ప్లాన్ తో ముందుకు వెల్లింది.

ఆపరేషన్ కుప్పం
కుప్పంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. ఆ తరవాత చంద్రబాబు ప్రతీ మూడు నెలలకు మూడు రోజులు పాటు కుప్పంలో పర్యటించారు. అక్కడే ఇంటి నిర్మాణం ప్రారంభించారు. జగన్ కుప్పంలో ముందుగానే తమ అభ్యర్దిని ప్రకటించి..ఎమ్మెల్సీ చేసారు. కుప్పం ను రెవిన్యూ డివిజన్ చేయటం.. క్రిష్ణా జలాలు, స్థానిక అంశాల పైన ప్రత్యేకంగా ఫోకస్ చేసారు. కుప్పం బాధ్యతలను మంత్రి పెద్దిరెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. పోలింగ్ ముందు రోజు వరకు వైసీపీ ప్రత్యేక వ్యూహాలు అమలు చేసింది. టీడీపీ నుంచి కౌంటర్ స్కెచ్ అమలు చేసారు. పోలింగ్ నాడు కుప్పంలో 2014లో 85.47 పోలింగ్ నమోదు కాగా..ఈ సారి 89.88 శాతం నమోదైంది.

చంద్రబాబు గెలిచేనా
అయితే..కుప్పంలో ఓటింగ్ సరళి గురించి మంత్రి పెద్దిరెడ్డి ప్రత్యేకంగా సీఎం జగన్ కు నివేదిక ఇచ్చారు. వైసీపీ అనుకూల ఓటింగ్ ఎక్కువ ఉందని మండలాల వారీగా లెక్కలు ఇచ్చినట్లు సమాచారం. కుప్పం మున్సిపాల్టీలో రెండు పార్టీల మధ్య వచ్చిన ఓట్లు ఇప్పుడు ఫలితంలో కీలకంగా మారుతుందనే అంచనాలు ఉన్నాయి. కుప్పం నుంచి చంద్రబాబు వరుసగా ఏడు సార్లు విజయం సాధించారు. ఈ సారి గెలిస్తే 8వ సారి వరుస విజయం గా నమోదు కానుంది. అయితే, వైసీపీ ముఖ్యులు మాత్రం చంద్రబాబు కుప్పంలో ఓడుతున్నారని జోస్యం చెబుతున్నారు. దీంతో..కుప్పంలో ఎన్నికల ఫలితం పైన టీడీపీతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications