ధూళిపాళ్లను అడ్డుకున్న గ్రామస్తులు.. కారు ధ్వంసం.. ఉద్రిక్తత
గుంటూరు జిల్లా అనమర్లపూడిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మట్టితవ్వకాలు జరుగుతున్నాయని తెలుగుదేశం పార్టీ నాయకులు ఫిర్యాదు చేయడంతో పొన్నూరు నియోజకవర్గ ఇన్ఛార్జి ధూళిపాళ్ల నరేంద్రం ఆ ప్రాంతాన్ని పరిశీలించడానికి అనమర్లపూడి వెళ్లారు. అయితే నరేంద్రను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలు అడ్డుకోవడంతోపాటు అతని కారు వెనకవైపు అద్దాలను పగలగొట్టారు. గోబ్యాక్ నరేంద్ర, డౌన్ డౌన్ ధూళిపాళ్ల అంటూ నినాదాలు చేశారు.
మట్టి తవ్వకాల పరిశీలనకు వెళ్లకుండా ధూళ్లిపాళ్ల నరేంద్ర ను అడ్డుకోవడానికే కారు ధ్వంసానికి పాల్పడ్డారని తెలుగుదేశం కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. అనమర్లపూడి అనే కాకుండా నియోజకవర్గ పరిధిలో క్వారీ, వడ్లమూడి, సంగంజాగర్లమూడి, చేబ్రోలు తదితర ప్రాంతాల్లో అక్రమంగా వైసీపీ నాయకులు మట్టితవ్వకాలు జరుపుతున్నారని, దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటోందని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపిస్తున్నారు. గతంలో కూడా చేబ్రోలు సమీపంలో మట్టి తవ్వకాలను పరిశీలించడానికి వెళ్లగా అక్కడ కూడా వైసీపీ కార్యకర్తలు ఎదురుతిరిగారు.
వైసీపీ అక్రమాలను బయటపెడితే రౌడీలతో దాడి చేయిస్తోంది ప్రభుత్వం. గుంటూరు జిల్లా, అనుమర్లపూడి చెరువులో వైసీపీ నేతల అక్రమ మట్టితవ్వకాలను పరిశీలించేందుకు వెళ్లిన తెలుగుదేశంనేత ధూళిపాళ్ల నరేంద్రను అడ్డుకుని... ఆయన కారుపై పోలీసుల సమక్షంలోనే దాడిచేసి, అద్దాలు ధ్వంసంచేసారు వైసీపీ రౌడీలు pic.twitter.com/HHtYGsQqq5
— Telugu Desam Party (@JaiTDP) June 13, 2022
పొన్నూరు ఎమ్మెల్యేగా కిలారి రోశయ్య ఎన్నికైన తర్వాత నియోజకవర్గంలో ఆగడాలు పెచ్చుమీరిపోయాయని ధూళిపాళ్ల నరేంద్ర ఆరోపించారు. నియోజకవర్గంలో పోలీసు రాజ్యం నడుస్తోందని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారంటూ మండిపడ్డారు. ఎవరెవరు? ఎక్కడెక్కడ? ఎంతెంత? మట్టి తవ్వకాలు చేపట్టింది అన్న విషయం వివరాలతో సహా సేకరించామని, పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఉపయోగం లేదని, తాము అధికారంలోకి వచ్చిన తర్వాత తవ్విన మట్టితో సహా అన్నీ వసూలు చేయిస్తామని హెచ్చరించారు. అన్యాయం జరుగుతోంది కాబట్టే తన కారును అడ్డుకున్నారని నరేంద్ర మండిపడ్డారు.