సీఎం జగన్ నిర్ణయం కోసం - పాపాలు అనుభవించాల్సిందే : వెంకయ్యతో సాయిరెడ్డి భేటీ..!!
రాష్ట్రపతి..ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో సీఎం జగన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని వైసీపీ ముఖ్యనేత విజయ సాయిరెడ్డి చెప్పారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా రాష్ట్రపతి ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. ఇదే సమయంలో ఎన్డీఏ - ప్రతిపక్షాల మధ్య ఎలక్టోర్ కాలేజ్ ఓటింగ్ విషయంలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. దీంతో..బీజేడీ.. టీఆర్ఎస్.. వైసీపీ కీలకంగా మారాయి. కొద్ది రోజుల క్రితం సీఎం జగన్ ఢిల్లీ వెళ్లిన సమయంలో ప్రధాని - కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో సమావేశమయ్యారు. ఆ సమయంలోనే రాష్ట్రపతి ఎన్నికల్లో వైసీపీ మద్దతు గురించి చర్చ జరిగినట్లుగా సమాచారం.
ఇతర పార్టీలు సైతం జగన్ ఇప్పుడు బీజేపీ అభ్యర్ధికే మద్దతు గా నిలుస్తారని డిసైడ్ అయపోయయి. అయితే, అభ్యర్ధిని ప్రకటించిన తరువాతనే వైసీపీ ఈ విషయంలో అఫీషియల్ గా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇదే అంశం పైన స్పందించిన విజయ సాయిరెడ్డి జగన్ ఇద్దరి ఎన్నికకు సంబంధించి ఒక నిర్ణయం తీసుకుంటారని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని.. కామర్స్ స్టాండింగ్ కమిటీ ఛైర్మన్ హోదాలో విజయసాయిరెడ్డి భేటీ అయ్యారు. కామర్స్ స్థాయి సంఘం నివేదికలను సమర్పించారు. పర్యాటక స్థాయి సంఘం నివేదికల ప్రజంటేషన్ను టీజీ వెంకటేశ్ సమర్పించారు. ఇక, దేశంలో బిగ్ డిబేట్ గా మారిన రాహుల్ గాంధీ - ఈడీ విచారణ అంశం పైనా ఆయన స్పందించారు.

మూడో రోజున రాహుల్ విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే, రాహుల్గాంధీ ఈడీ విచారణ కేంద్రం కక్ష సాధింపు కాదని సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కర్మ సిద్ధాంతంతో పాటూ చేసిన పాపాలు అనుభవించాల్సిందేనన్నారు. కేంద్రం కక్షసాధింపు చేయట్లేదని.. సుబ్రహ్మణ్యస్వామి పిల్ పైనే విచారణ జరుగుతోందని అన్నారు. రెండు రోజుల క్రితం దీని పైనే స్పందించిన సాయిరెడ్డి ఇదే తరహాలో ట్వీట్ చేసారు. రాహుల్ విచారణ కక్ష్య పూరితంగా చేస్తున్నారంటూ కాంగ్రెస్ దేశ వ్యాప్తంగా నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలో సాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కొత్త చర్చకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications