భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ వెనుక...భారీ లూటీకి బాబు సర్కారు స్కెచ్: విజయసాయిరెడ్డి
అమరావతి:భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్ వెనుక భారీ దోపిడీకి కుట్ర జరిగిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన ఈ మేరకు ట్విట్టర్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ టెండర్లో పాల్గొనకుండా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ)ని నిషేధించారని...ఇది కుట్రలో భాగమేనని విజయసాయిరెడ్డి ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కేవలం ప్రైవేట్ సంస్థలను మాత్రమే టెండర్కు అర్హులను చేస్తూ చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వెనుక భారీ దోపిడీకి పథక రచన జరిగిందని విజయసాయిరెడ్డి ఆరోపించారు.
గతంలో ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఈ టెండర్ను దక్కించుకోగా...దానిని కుంటి సాకులు చూపుతూ రద్దు చేసిన సిఎం చంద్రబాబు తాజాగా జారీ చేసిన టెండర్లో అసలు ఎయిర్ పోర్ట్స్ అథారిటీ పాల్గొనకుండా నిషేధించడపై విజయసాయిరెడ్డి ఆరోపణల వర్షం కురిపించారు. అసలు ఇది ఏ విధంగా సరైందని ప్రశ్నించారు. ప్రభుత్వ సంస్థలు కాకుండా ప్రైవేట్ కంపెనీలైతే వారితో కుమ్మక్కై ఇష్టారాజ్యంగా దోచుకోవచ్చని, ఎయిర్ పోర్ట్స్ అథారిటీ అయితే ఆ విధంగా దోపిడీ సాధ్యం కాదనే చంద్రబాబే ఇలా చేశారని విజయసాయిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
తన ఆరోపణలు నిజం కాదని చంద్రబాబు చెప్పగలరా?...అని విజయసాయి రెడ్డి నిలదీశారు. భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణంలో భారీ లూటీకి టిడిపి తెరదీసిందని కొంతకాలంగా వైసిపి ఆరోపణలు చేస్తోంది. అందుకు సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో దోపిడీ వీలయ్యేలాగా...తమ వాళ్లకే పనులు దక్కేలా ఏ విధంగా నిబంధనలు రూపొందిస్తున్నారో ఆదే తరహాలో ఈ ఎయిర్పోర్ట్ పనులను కూడా అప్పగించేందుకు టిడిపి సిద్దమయిందనేది వైసిపి ఆరోపణ.
భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణంపై కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఏఏఐ) ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తున్నా...ఎక్కువ రెవెన్యూ వాటా ఇస్తామని చెప్పినా ఆ సంస్థ నుంచి కమీషన్లు దండుకునే వీలు ఉండదని మొత్తానికి టెండర్లనే రద్దు చేశారని వైసిపి ఆరోపిస్తోంది. ఆ ప్రకారమే తాజాగా ఆహ్వానించిన కొత్త బిడ్లలోనూ ఏఏఐ పాల్గొనేందుకు వీలు లేకుండా...ఏ నిబంధన విధిస్తే ఏఏఐను టెండర్లలో పాల్గొనకుండా నిలువరించవచ్చో...ఆ నిబంధనను రూపొందించి మరీ రాష్ట్ర ప్రభుత్వం తెర మీదకు తెచ్చిందంటున్నారు.
ఎయిర్ పోర్ట్ నిర్మాణం బిడ్లలో పాల్గొనే సంస్థ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుండాలనే నిబంధన పెట్టడం వెనుక మతలబు ఏమిటని వైసిపి నేతలు ప్రశ్నిస్తున్నారు. కేవలం ఏఏఐని నిలువరించే ఉద్దేశంతోనే ఈ నిబంధన పెట్టారని వారంటున్నారు. మూడు దశల్లో రూ. 4,209 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించనున్న ఈ ఎయిర్పోర్ట్ నిర్మాణ ప్రాజెక్ట్ లో వందల కోట్లు కొల్లగొట్టేందుకు ప్రభుత్వ పెద్దలు చూస్తున్నారని వైసిపి నేతలు ఆరోపిస్తున్నారు.