భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణంపై వైసీపీ నాడు-నేడు: ఏపీలో ఆసక్తికర చర్చ
విజయనగరం జిల్లా భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. వైజాగ్ ను పరిపాలనా రాజధానిగా ప్రకటించడంతో భోగాపురం ఎయిర్ పోర్టును త్వరగా నిర్మించేందుకు ఏపీ క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది . అమరావతిలో జరిగిన కేబినెట్ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్న ప్రభుత్వం భోగాపురం ఎయిర్పోర్టు అభివృద్ధి పనులకు సంబంధించి పీపీపీ విధానంలో జీఎంఆర్కు అప్పజెప్పారు. గతంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్న సమయంలో జీఎంఆర్ కు పనులు అప్పగించటంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన వైసీపీ ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకోవటంపై చర్చ జరుగుతుంది.
భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు జీఎంఆర్ కు .. ఏపీ క్యాబినెట్ నిర్ణయం
ఇక ఏపీ క్యాబినెట్ భోగాపురం ఎయిర్ పోర్ట్ అభివృద్ధి చెయ్యాలని నిర్ణయం తీసుకుంది .ఇక నిర్మాణ పనులు జీఎంఆర్ కు అప్పగించనుంది . ప్రభుత్వం సేకరించిన భూముల్లో సుమారు 2,200 ఎకరాలు మాత్రమే జీఎంఆర్కు ఇస్తారు. మిగతా 500 ఎకరాలను ప్రభుత్వం తన ఆధీనంలో ఉంచుతున్నట్లు కేబినెట్ కీలక నిర్ణయం తీసుకొంది. విమానాశ్రయ పనులు ప్రారంభించడానికి జీఎంఆర్ సంస్థ రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది .
జీఎంఆర్కు పనులు ఇవ్వటంపై అప్పట్లో తీవ్ర విమర్శలు గుప్పించిన వైసీపీ
జీఎంఆర్ సంస్థకు విమానాశ్రయల నిర్మాణం తో పాటు నిర్వహణలో చాలా అనుభవం ఉన్నప్పటికీ గతంలో టీడీపీ హయాంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులు జీఎంఆర్ సంస్థకు అప్పగిస్తామంటే వైసీపీ ఆరోపణలు గుప్పించింది. వైసీపీ అది ఓ భారీ స్కాం అని ప్రచారం చేసిన పరిస్థితి ఉంది. గత ఏడాది మార్చిలో ప్రభుత్వం భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణానికి జీఎంఆర్కు బిడ్స్ను ఖరారు చేసిన సమయంలో చంద్రబాబు జీఎంఆర్ కు ఇవ్వటం భారీ స్కామ్ అని సీఎం జగన్ మానస పుత్రిక అయిన పత్రికలో వార్తలు హల్చల్ చేశాయి.
నేడు ప్లేటు ఫిరాయించిన వైసీపీ చేసింది అదే
భారీ ముడుపుల కోసమే చంద్రబాబు ఎన్నికల కోడ్ ఉన్నప్పటికీ బిడ్స్ ఆమోదించారని వైసీపీ నేతలు విమర్శలు గుప్పించారు. చాలా తీవ్రంగా జీఎంఆర్ కు ఇవ్వడం ప్రజాధనాన్ని దోపిడీ చేయడమేనని నాడు తేల్చి చెప్పారు వైసీపీ నేతలు . ఇక ఇప్పుడు అదే వైసీపీ అధికారంలోకి రాగానే ప్లేటు ఫిరాయించి జీఎంఆర్కు నిర్మాణ పనులు అప్పగించే పనిలో ఉంది. భోగాపురం ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేబినెట్లో నిర్ణయం తీసుకుంది.
భోగాపురం ఎయిర్ పోర్ట్ పై ఆసక్తికర చర్చ
అయితే చంద్రబాబు హయాంలో భోగాపురం ఎయిర్ పోర్ట్ పనులు జీఎంఆర్ కు ఇవ్వటాన్ని వ్యతిరేకించిన వైసీపీ , ఇప్పుడు తమ హయాంలో జీఎంఆర్ కు ఇవ్వాలనుకోవటం ఆసక్తికర చర్చకు కారణం అవుతుంది . ఇక ప్రతీదీ రివర్స్ టెండరింగ్ విధానంలో నిర్మిస్తామని చెప్పిన వైసీపీ సర్కార్ భోగాపురం ఎయిర్ పోర్ట్ విషయంలో రివర్స్ టెండర్ విధానం మర్చిపోయిందని కూడా చర్చ జరుగుతుంది.