పవన్ తో వైసీపీ నేత భేటీ - ఆ నియోజకవర్గంలో సీన్ మారుతోంది..!!
వచ్చే ఎన్నికలకు ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి రాజుకుంది. ఉభయ గోదావరి జిల్లాల్లోని సీట్లు మరోసారి ఏపీలో కీలకంగా మారనున్నాయి. ఉమ్మడి గోదావరి జిల్లాల్లో 2019లో వైసీపీ పట్టు బిగించింది. ఇప్పుడు టీడీపీ - జనసేన అక్కడే వైసీపీని దెబ్బ కొట్టాలని భావిస్తున్నాయి. అందులో ప్రధానంగా జనసేన..అక్కడి సామాజిక సమీకరణాలను తమకు అనుకూలంగా మలచుకొనే ప్రయత్నాలు చేస్తోంది. ఇదే క్రమంలో వైసీపీ అక్కడ పక్కా సామాజిక లెక్కలతో ముందుకు వెళ్తోంది.

రాజోలులో వైసీపీ వర్సస్ జనసేన
2019 ఎన్నికల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో టీడీపీ నాలుగు సీట్లు గెలవగా.. జనసేన ఒక్క సీటు గెలిచింది. ఆ తరువాత జనసేన నుంచి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వర ప్రసాద్ వైసీపీకి మద్దతు దారుడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో రాజోలు నుంచి 2014, 2019 ఎన్నికల్లో బొంతు రాజేశ్వర రావు పోటీ చేసి ఓడిపోయారు. రాపాక గత ఎన్నికల్లో బొంతు పైన 700 ఓట్ల తేడాతో గెలిచారు. ఎన్నికలు అయిన తరువాత నియోజకవర్గంలో వైసీపీ కో ఆర్డినేటర్ బాధ్యతలు అమ్మాజీకి అప్పగించింది. అప్పటి నుంచి రాజేశ్వర రావు అసహనంతో ఉన్నారు. ఇక, పార్టీలో రాపాకకు ఇస్తున్న ప్రాధాన్యత.. నియోజకవర్గంలో వైసీపీ ఇంఛార్జ్ గా రాపాక వ్యవహరిస్తుండటంతో బొంతు ఇక పార్టీ వీడాలని నిర్ణయించారు. ఆయన గతంలో ప్రభుత్వ రూరల్ వాటర్ సప్లై సలహాదారుగా పని చేసారు.

ఎమ్మెల్యే ఇటు..వైసీపీ నేత అటు
పార్టీకి రాజీనామా లేఖ పంపారు. కానీ, పార్టీ నేతలు ఎవరి నుంచి స్పందన రాలేదు. దీంతో..ఇప్పుడు రాజేశ్వర రావు తాజాగా జనసేన అధినేత పవన్ తో సమావేశమయ్యారు. ఆయన జనసేనలో చేరటం దాదాపు ఖాయమని తెలుస్తోంది. 2019 ఎన్నికల్లో జనసేన నుంచి గెలిచిన ఎమ్మెల్యే వైసీపీకి మద్దతుగా వెళ్లటం.. వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన నేత ఇప్పుడు జనసేనకు దగ్గరయ్యారు. అయితే, బొంతు చాలా రోజులుగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడు జనసేన అధినేతతో సమావేశం అవ్వటం ద్వారా ఆయన వచ్చే ఎన్నికల్లో జనసేన టికెట్ ఆశిస్తున్నట్లుగా చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఎటువంటి హామీ ఇవ్వలేదని సమాచారం. ముందుగా పార్టీలో చేరి పని చేసుకోవాలని సూచించారని తెలుస్తోంది.

గోదావరి లో మారుతున్న సమీకరణాలు
వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి గోదావరి జిల్లాల్లో తిరిగి పట్టు కొనసాగించాలని వైసీపీ ప్రణాళికలు సిద్దం చేస్తోంది. పవన్ సైతం పలు మార్లు గోదావరి ప్రజలు మద్దతుగా నిలవాలని కోరుతూ వచ్చారు. ఇక, కొద్ది రోజులుగా గోదావరి జిల్లాలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారిపోతున్నాయి. ఈ క్రమం లో వైసీపీ గోదావరి జిల్లాల సమన్వయకర్త ఎంపీ మిథున్ రెడ్డి పలు మార్లు జిల్లాల్లో పర్యటించి..నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పుడు గోదావరి జిల్లాలో నేతల పార్టీ మార్పు వ్యవహారం ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా..ఇప్పటికే మొదలైంది. దీంతో..రానున్న రోజుల్లో మరిన్ని ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకొనే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications