ఉద్యోగం లేదు, భార్య విడిచి వెళ్లింది: సీఎంకు లేఖ రాసి ఆత్మహత్య
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి ఓ యువకుడు చనిపోయిన సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది.
విశాఖ: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు లేఖ రాసి ఓ యువకుడు చనిపోయిన సంఘటన విశాఖ జిల్లాలో చోటు చేసుకుంది. ఉద్యోగం రాకపోవడం వల్లనే తమ కుమారుడు చనిపోయాడని యాతపాలెం ప్రాంతానికి చెందిన పితాని రాజు, వరలక్ష్మి చెబుతున్నారు.
వీరి కొడుకు శివప్రసాద్ ఈ నెల ఏడో తేదీన మర్రిపాలెం వద్ద రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అతను రాసిన సూసైట్ నోట్ రెండు రోజుల క్రితం తల్లిదండ్రులకు లభించింది. దాన్ని పోలీసులకు అందజేశారు.
సోమవారం వారు మీడియాతో మాట్లాడారు. పితాని శివదుర్గాప్రసాద్ (33) బీటెక్ చదువుకున్నాడు. చదువు పూర్తిచేసి ఏళ్లు గడిచినా ఎక్కడా ఉద్యోగం దొరకలేదు. రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ పోషణ నిమిత్తం చిన్నచిన్న పనులు చేస్తుండేవాడు.
అతను ఈ నెల ఏడున మర్రిపాలెం వద్ద రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శివప్రసాద్ ఎందుకు చనిపోయాడన్న విషయం కుటుంబ సభ్యలతో సహా ఎవరికీ తెలియదు. అయితే, సూసైడ్ నోట్ దొరకడంతో విషయం వెలుగు చూసింది.
తాను బీటెక్ చదువుకున్నా ఉద్యోగం దొరకలేదని, ప్రభుత్వ ఉద్యోగం రాలేదని తన భార్య నన్ను విడిచి వెళ్లిపోయిందని, దీంతో తాను చాలా మనస్తాపం చెందానని, ఎంతోమంది యువకులు ఉన్నత చదువులు చదువుకున్నవారు ఉన్నారని, చాలావరకు ఉపాధి లేక నిరుద్యోగులుగా తిరుగుతున్నారని, వీరందరికీ ఉపాధి దొరకాలని, తనలా ఎవరూ చనిపోకూడదని, విశాఖకు రైల్వేజోన్ వచ్చేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, విశాఖకు రైల్వేజోన్ రావడం వల్ల చదువుకున్న యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ లేఖను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాశాడు.