యువకుడి దారుణ హత్య: మాస్క్లు ధరించి దాడి
కర్నూలు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లా బండి ఆత్మకూరు మండలం చిన్నదేవలాపురం గ్రామంలో ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు గొంతు కోసం అత్యంత దారుణంగా చంపేశారు. గ్రామానికి చెందిన లింగంపల్లి సురేష్(27) గతరాత్రి ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో అర్ధరాత్రి దాటాక ముఖాలకు మాస్క్లు ధరించి ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు పక్కనే నిద్రిస్తున్న సురేష్ తల్లిని పక్కకు లాగిపడేసి సురేష్ను కత్తితో గొంతుకోసి పరారయ్యారు.
సమాచారం అందుకున్న ఏఎస్పీ శశికుమార్, నంద్యాల వన్ టౌన్ సీఐ ప్రతాప్ రెడ్డి, స్థానిక ఎస్సై శరత్ కుమార్ రెడ్డి ఘటనా స్థలాన్ని సందర్శించారు. డాగ్స్క్వాడ్తో నిందితుల ఆచూకీ కోసం ప్రయత్నించారు. సరేష్తో కల్లం రస్తా విషయంలో జరిగిన వివాదమే ఘటనకు కారణంగా పోలీసులు భావిస్తున్నారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు గ్రామంలోని అనుమానితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి
ఇదిలావుంటే, పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు మండలం ఉలంపర్రు వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఇందులో గాయపడిన మరో ఇద్దరిని చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని సమాచారం.
పుష్కరాలకు వస్తుండగా..
తూర్పుగోదావరి జిల్లాలోని జగ్గంపేట వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని ఇద్దరు మరణించారు. ఘటనలో తీవ్రగాయాలపాలైన మరొకరిని వెంటనే ఆస్పత్రికి తరలించారు. మృతులను శ్రీకాకుళం జిల్లా పాలకొండకు చెందిన పడాల యశ్వంత్, గోపీనాయుడుగా గుర్తించారు. పుష్కరాల కోసం వీరు రాజమండ్రి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.