సచివాలయాల ఉద్యోగులకు జగన్ సర్కార్ మరో గుడ్ న్యూస్..
ఏపీలో గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటికే రెండేళ్ల పదవీకాలం పూర్తి చేసుకుని ప్రొబేషన్ ఖరారు చేసుకున్న వీరికి పే స్కేళ్లను ఖరారు చేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. వీటి ప్రకారం సచివాలయంలో వివిధ కార్యదర్శులకు వారికి ఉన్న ప్రాధాన్యత మేరకు జీతాల స్కేళ్లు ఖరారయ్యాయి. వీటిని అమలు చేసేలా కలెక్టర్లు, ఇతర సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
2020లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ప్రభుత్వం ఎంపిక చేసిన సచివాలయాల కార్యదర్శులకు లేదా ఉద్యోగులకు ప్రొబేషన్ ఖరారు చేస్తున్నట్లు ప్రభుత్వం ఇవాళ జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. వీరికి గతంలో నిర్వహించిన శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడంతో పాటు రెండేళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఈ ప్రొబేషన్ వర్తించనుంది. దీని ప్రకారం మే 1 నుంచి కొత్త పే స్కేళ్లు వర్తిస్తాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.

రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో మొత్తం 19 కేటగిరీలకు చెందిన కార్యదర్శులు విధులు నిర్వర్తిస్తున్నారు. వీరికి రూ.23120 తో మొదలుపెట్టి గరిష్టంగా రూ.74770 వరకూ వేతనాలను ఖరారు చేశారు. పంచాయతీ సెక్రటరీ గ్రేడ్ 5కు, వార్డు అడ్మిన్ సెక్రటరీకి ఇందులో గరిష్ట పే స్కేళ్లు లభించాయి. మిగతా వారందరికీ దాదాపు సమాన పే స్కేళ్లు నిర్దారించారు. ఇప్పటికే ప్రొబేషన్ ఖరారైన వారికి ఈ పేస్కేళ్లు మే 1 నుంచి వర్తించబోతున్నాయి.
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిర్ణయించిన ఆయా పేస్కేళ్లను మే 1 నుంచి అమలు చేసేలా కలెక్టర్లతో పాటు సచివాలయశాఖ, పంచాయతీ రాజ్ శాఖ, ఇతర శాఖలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ప్రతీ శాఖకూ ప్రత్యేకంగా ఆదేశాలు పంపినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న సచివాలయ ద్వారా సంక్షేమ పథకాల లబ్దిదారులకు ఆయా పథకాలను ప్రభుత్వం మెరుగ్గా అందిస్తోంది.












Click it and Unblock the Notifications