Chandrababu కు జగన్ తీపికబురు- నాలుగు లైన్లుగా కరకట్ట రోడ్డు- రూ.150 కోట్లతో
ఏపీలో వైసీపీ ప్రభుత్వం ఏర్పాటైన దగ్గరి నుంచి కక్షపూరిత రాజకీయాలు చేస్తుందని విపక్ష నేత చంద్రబాబు ఆరోపిస్తుండగా.. అందుకు తగినట్లుగానే అమరావతిలో ఆయన నివాసం పక్కనే ఉన్న ప్రజావేదిక కూల్చివేసి దాని శిధిలాలను సైతం అధికారులు ఇప్పటివరకూ తొలగించలేదు. ఈ నేపథ్యంలో సీఎం జగన్కు పురపాలకశాఖ అధికారులు ఓ కీలక ప్రతిపాదన చేయడం, అందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం చంద్రబాబుకు భారీ ఊరటనివ్వబోతోంది. అమరావతిలోనే ఓ కీలక పరిణామంగా కూడా దీన్ని జనం చర్చించుకుంటున్నారు.
అభివృద్ధికి దూరంగా అమరావతి
వైసీపీ సర్కారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిందో అప్పటి నుంచీ అమరావతికి బ్యాడ్టైమ్ నడుస్తోందని ఇక్కడ జనం చెప్తూ ఉంటారు. ఒకప్పుడు చంద్రబాబు సర్కారు రాజధానిగా ప్రకటించి కాస్తో కూస్తో అభివృద్ధి చేసిన ఈ ప్రాంతాన్ని జగన్ సర్కారు వచ్చాక పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లు అక్కడి నిర్మాణాలే చెబుతాయి. గతంలో ప్రపంచ స్ధాయి రాజధాని నిర్మాణం జరుగుతుందంటూ సింగపూర్ సైతం ఆసక్తి చూపించిన ప్రాంతం ఇప్పుడు సగం నిర్మాణాలతో పూర్తిగా కళ తప్పింది. ఇదంతా ఓ ఎత్తయితే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ దాటాక సీతానగరం ఆక్విడెక్ట్ మీదుగా అమరావతికి వెళ్లే కృష్ణానది కరకట్ట రోడ్డు మరో ఎత్తు.
ఉండవల్లి కరకట్టకు మహర్దశ
చంద్రబాబు హయాంలో కాస్తో కూస్తో అభివృద్ధి చేసినా , ఇంకా సింగిల్ లైన్ రోడ్డుగానే మిగిలిపోయిన ఉండవల్లి కరకట్ట రోడ్డును వైసీపీ సర్కారు హయాంలో అస్సలు పట్టించుకోలేదు. స్వయంగా సీఎం జగన్ అసెంబ్లీలోనే వీడియో ప్రజంటేషన్తో ఈ రోడ్డు దుస్ధితిని వివరించారు కూడా. ఓ కారు వస్తే రెండో కారు వచ్చేందుకు అవకాశం లేని రోడ్డు అంటూ ఆక్షేపించారు. అయితే ఇప్పుడు అదే రోడ్డును అభివృద్ధి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దీనికి సీఎం జగన్ ఆమోద ముద్ర వేయడంతో ఉండవల్లి కరకట్టకు మహర్దశ పట్టనుంది.
చంద్రబాబు ఇంటికి నాలుగు లైన్ల రోడ్డు
సీతానగరం నుంచి మొదలయ్యే ఈ రోడ్డు మధ్యలో చంద్రబాబు ఇంటి మీదుగా అమరావతి సీడ్ యాక్సిస్ రోడ్డు వరకూ ఉంటుంది. ప్రస్తుతం సింగిల్ రోడ్డుగా ఉన్న రోడ్డుపైనే విపక్ష నేత చంద్రబాబు రాకపోకలు సాగిస్తుంటారు. సీఎం జగన్ కూడా ఇదే రోడ్డుపై తాడేపల్లిలోని ఇంటికి వెళ్తుంటారు. మంత్రులు సైతం సచివాలయం నుంచి విజయవాడ వెళ్లేందుకు ఇదే రోడ్డును ఆశ్రయిస్తుంటారు. దీంతో ఈ ఉండవల్లి కరకట్ట రోడ్డును నాలుగు లైన్ల రహదారిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. రూ.150 కోట్ల ఖర్చుతో చేపట్టే ఈ రోడ్డును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
విజయవాడ- అమరావతికి పెరగనున్న కనెక్టివిటీ
ప్రస్తుతం సింగిల్ రోడ్డుగానే ఉన్న ఈ కరకట్టను నాలుగు లేన్లుగా మారిస్తే విజయవాడ నుంచి అమరావతికి వెళ్లేందుకు కనెక్టివిటీ మరింత పెరగనుంది. అలాగే భారీ వాహనాలు సైతం రాకపోకలు సాగించేందుకు వీలు కలుగుతుంది. సీఎం, మంత్రులు, విపక్ష నేత కాన్వాయ్ కూడా వేగంగా ప్రయాణించేందుకు వీలు కలుగుతుంది. వీఐపీల భద్రతకు కూడా ఇబ్బందులు ఉండవు. దీంతో ప్రభుత్వం ఈ రోడ్డును త్వరితగతిన అభివృద్ధి చేసేందుకు సిద్ధమవుతోంది. అమరావతి ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు కీలకంగా మారనుందని స్వయంగా సీఎం జగన్ నిన్నటి ఏఎంఆర్డీఏ సమీక్షలో వెల్లడించారు. దీంతో పాటు అమరావతిలో సీడ్ యాక్సిస్ రోడ్డును కూడా పూర్తి చేసి కనెక్టివిటీ పెంచాలని జగన్ ఆదేశాలు ఇచ్చారు.