జైల్లో పుస్తకం రాసిన దాడి కేసు నిందితుడు: జగన్ కుటుంబాన్ని కలిసి రాజీకి యత్నం!!
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి పైన గతంలో విశాఖపట్నం విమానాశ్రయంలో కత్తితో దాడి చేసిన శ్రీనివాస రావు జైలులో ఓ పుస్తకాన్ని రాశాడు. ఆ పుస్తకాన్ని విడుదల చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీనివాస రావు తరఫున సలీం అనే న్యాయవాది వాదిస్తున్నారు.
చంద్రబాబు డీజీపీపై ఒత్తిడి చేశారు, 'జగన్ తప్పించుకున్నారు, రేపు కుట్ర బయటకు అన్నారు'
పుస్తకం విడుదలకు ప్రయత్నాలు
ఆ పుస్తకం విడుదల కోసం ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే జడ్జికి, జైళ్ల శాఖ డీజీకి లేఖలు అందించినట్లుగా కూడా శ్రీనివాస రావు తరఫు న్యాయవాది చెప్పారని తెలుస్తోంది. అంతేకాదు, శ్రీనివాస రావు ఇప్పటికీ జగన్ అభిమానిగానే ఉన్నారని, వైసీపీ అధినేతకు, ఆయన కుటుంబ సభ్యులకు క్రిస్మస్, న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెప్పాలని కుతూహలపడ్డారని కూడా చెప్పారని తెలుస్తోంది.
వారితో మాట్లాడి కేసును ముగించే ప్రయత్నం
సరైన ఆధారాలు లేకుండా పోలీసులు శ్రీనివాస రావును ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన తరఫు లాయర్ తెలిపారు. అతనిని జగన్ కుటుంబ సభ్యుల వద్దకు తీసుకు వెళ్లి మాట్లాడించి, ఈ కేసును ముగించాలని చూస్తున్నామని చెబుతున్నారని తెలుస్తోంది.
సుప్రీం కోర్టుకు వెళ్లే యోచనలో చంద్రబాబు ప్రభుత్వం
కాగా, జగన్ పైన దాడి కేసులో ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఈ మేరకు శుక్రవారం ఉత్తర్వులు వచ్చాయి. గత ఏడాది అక్టోబర్ 25న జరిగిన దాడి కేసుపై వైసీపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం దీనిపై విచారణ జరిగింది. జగన్పై దాడి కేసులో ఏపీ ప్రభుత్వం సరిగ్గా దర్యాప్తు చేయలేదని, ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించాలని వైసీపీ న్యాయవాదులు కోరారు. కేసు విచారణ ఆలస్యమైతే న్యాయం జరగదన్నారు. దాడి జరిగిన ప్రదేశం కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి ఉంటుందని, కాబట్టి జాతీయ సంస్థలకు ఇవ్వొచ్చని భావించిన ధర్మాసనం.. కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ కేసును దర్యాప్తు చేసి నిందితుడిని విచారించిందని, పూర్తి స్థాయిలో కేసు విచారణ జరిగిందని ఏపీ ప్రభుత్వం తరఫు లాయర్ వాదనలు వినిపించారు. కానీ హైకోర్టు కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ అప్పుడే విచారణ ప్రారంభించింది. మరోవైపు అంతకుముందే ఎన్ఐఏకు కేంద్రం కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. సీఐఎస్ఎఫ్ అసిస్టెంట్ కమాండెట్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసింది. కేసు నమోదును కేంద్రం హైకోర్టుకు తెలిపింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది.