పొగాకు రైతులకు కేంద్రం, ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ - భారీ ప్యాకేజీ..!!
పొగాకు రైతులకు బిగ్ రిలీఫ్. కేంద్రం తీపి కబురు చెప్పింది. కొంత కాలంగా ధరలు లేక పొగాకు రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇటీవల సంభవించిన వాతావరణ మార్పులు, తుపాన్లు, ఇతర కారణాల వల్ల తీవ్రంగా నష్టపోయిన పొగాకు రైతులను ఆర్థికంగా ఆదుకోవాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల పెట్టుబడి భారాన్ని తగ్గించి, వారికి తక్షణ ఆర్థిక సహాయం అందించేందుకు రూ.50,000 వరకు ఇంట్రెస్ట్ ఫ్రీ (వడ్డీ లేని) రుణ సదుపాయాన్ని కల్పించాలని నిర్ణయించింది.
పొగాకు రైతుల కోసం కేంద్ర, ఏపీ ప్రభుత్వాలు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పొగాకు రైతుల కోసం సహాయ ప్యాకేజీ ప్రకటించాయని కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. అందులో భాగంగా ప్రతి రైతుకు రూ.50 వేల వడ్డీలేని రుణలను రెండేళ్లలో చెల్లిస్తున్నట్లు ప్రకటించారు. సుమారు 45 వేల మంది రైతులకు కేంద్ర రుణ పథకం వర్తిస్తుందని తెలిపారు. రాష్ట్రంలోని పొగాకు రైతులకు రూ.250 కోట్ల కేంద్ర రుణ సాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. లో, ఆఫ్ స్టైల్ పొగాకుకు కిలోకు రూ.10ల రాష్ట్ర ప్రోత్సాహకం అందజేస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సుమారు రూ.100 కోట్ల ఆర్థిక సహాయం అందజేస్తున్నట్లు ప్రకటించారు.

కేంద్రం తాజా నిర్ణయంతో
కాగా, బ్రైట్ - రూ.230, మీడియం రూ.190, లో రూ.110, ఆఫ్ స్టైల్ రూ.130 కనీస కొనుగోలు ధరకు ఎగుమతిదారులు అంగీకారం తెలిపారని వెల్లడించారు. రైతుల ఖాతాల్లో నేరుగా రాష్ట్ర ప్రోత్సాహక నగదు జమ అవుతాయని తెలిపారు. రేపటి నుంచే ఈ సహాయ ప్యాకేజీ అమల్లోకి వస్తుందని స్పష్టం చేశారు. గత ఏడాది రూ.146 కోట్లతో బ్లాక్ బర్లీ పొగాకును ఏపీ ప్రభుత్వం కొనుగోలు చేసిందని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన సమయంలో ఈ మేరకు కేంద్ర మంత్రులతో చర్చలు చేసారు. ఇక.. పొగాకు రైతులకు మద్దతుగా ఈ నెల 5న జగన్ పశ్చిమ గోదావరిలో పర్యటనకు సిద్దమయ్యారు. ఈ సమయంలో తాజా ప్రకటన వెలువడింది.













Click it and Unblock the Notifications