చైనాను ఆక్రమించిన మన చిరుతలు.. ఎవరికీ దొరక్కుండా 3 దేశాల్లో విహారం..
ఎముకలు కొరికే చలి.. సముద్ర మట్టానికి దాదాపు 19,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో నిటారైన మంచు పర్వతాలు.. కంటికి అసలు కనిపించకుండా రాళ్ల రంగులోనే కలిసిపోయే విచిత్రమైన శరీర నిర్మాణం. ప్రపంచంలోనే అత్యంత అరుదైన, సులువుగా కంటపడని మంచు చిరుతలకు ఆవాసం. అందుకే వన్యప్రాణి ప్రేమికులు 'హిమాలయాల దెయ్యాలు' (Ghosts of the Mountains) అని పిలుస్తుంటారు. అయితే, ఈ మంచు రాజకుమారుల జీవితాలకు సంబంధించిన ఒక విస్తుపోయే రహస్యాన్ని సైంటిస్టులు ఛేదించారు. మానవులు గీసుకున్న దేశాల సరిహద్దులను ఈ మంచు చిరుతలు అస్సలు లెక్కచేయడం లేదని ఒక సంచలన పరిశోధనలో తేలింది!
నేపాల్, ఇండియా (సిక్కిం), చైనా (టిబెట్) సరిహద్దులు కలిసే అత్యంత సాహసోపేతమైన 'కాంచనగంగ పరిరక్షణ ప్రాంతం'లో పరిశోధకులు నాలుగు మంచు చిరుతలకు రేడియో జీపీఎస్ కాలర్లను అమర్చి వాటి కదలికలను నిశితంగా గమనించారు. ఆసియాలోని క్లిష్టమైన పర్వత ప్రాంతాల్లో ఏళ్ల తరబడి శోధించి 'లాప్ఛెంబా, యాలుంగ్, ఘంగ్జెన్జ్వెంగా' అని నామకరణం చేసిన మూడు ప్రధాన చిరుతలతో సహా నాలుగు ప్రాణుల నుంచి ఏకంగా 4,707 లొకేషన్ పాయింట్లను సేకరించారు. ఈ దత్తాంశం సైంటిస్టుల పాత అంచనాలను తలకిందులు చేసింది.

మూడు దేశాల మధ్య 'నో పాస్పోర్ట్' ప్రయాణం!
ఈ అధ్యయనంలో బయటపడిన అతి పెద్ద ఆశ్చర్యం ఏంటంటే.. ఈ మంచు చిరుతలు కేవలం నేపాల్ సరిహద్దులకే పరిమితం కాకుండా, తమ జీవనం కోసం భారత్, చైనా భూభాగాల్లోకి నిరంతరం రాకపోకలు సాగిస్తున్నాయి. ట్రాక్ చేసిన కాలంలో ప్రతీ చిరుత 5 నుంచి 7 సార్లు అంతర్జాతీయ సరిహద్దులను దాటింది. ఒక చిరుత చైనాలోకి ఐదుసార్లు వెళ్ళి నెలల తరబడి గడిపితే, 'యాలుంగ్' అనే మరో చిరుత తన తిరిగే సగం ప్రాంతాన్ని ఇండియా వైపు ఉన్న పర్వతాల్లోనే ఎంచుకుంది. ఇవి తమ సమయాంలో 10 నుంచి 34 శాతం కాలం పొరుగు దేశాల సరిహద్దుల్లోనే గడుపుతున్నట్లు స్పష్టమైంది.
అంచనాలకు 97 రెట్లు పెద్దదిగా ఆవాసాలు!
గతంలో సైంటిస్టులు అనుకున్న దానికంటే ఈ మంచు చిరుతల సంచార ప్రాంతంఎంతో విశాలమైనదని తేలింది. మునుపటి పరిశోధనా నివేదికల కంటే ఇవి ఏకంగా 6 నుంచి 97 రెట్లు పెద్దదైన భూభాగంలో విహరిస్తున్నాయని సాంకేతిక విశ్లేషణలో వెల్లడైంది. ఇవి సుమారు 39 నుంచి 398 చదరపు మైళ్ల సువిశాల పర్వత ప్రాంతాన్ని తమ సామ్రాజ్యంగా మార్చుకున్నాయి. జీవించడానికి, ఆహార వేటకు ఇవి ఊహించిన దానికంటే అత్యంత విస్తారమైన స్థలాన్ని ఉపయోగిస్తున్నాయని ఈ అధ్యయనం చాటిచెప్పింది.
గర్జించని జీవి.. పరిశోధనకు సవాల్!
సింహాలు, పులుల మాదిరిగా మంచు చిరుతలు గర్జించలేవు. పైగా మంచు రాళ్ల మధ్య వీటికి ఉండే స్వాభావికమైన రంగు వీటిని మనుషుల కంటపడకుండా కాపాడుతుంది. కాబట్టి వీటి సమాచారం సేకరించడం ఎంతో కష్టతరమైన పని. అయితే సరిహద్దులు దాటుతూ ఇవి చేస్తున్న ప్రయాణాలు ఇప్పుడు అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ సంస్థలకు కొత్త సవాలు విసురుతున్నాయి. ఏదో ఒక దేశం తన పరిధిలోని అడవులను కాపాడుకుంటే సరిపోదని, ఈ అరుదైన జీవులను కాపాడాలంటే భారత్, నేపాల్, చైనా దేశాలు కలిసికట్టుగా సంయుక్త రక్షణ వ్యూహాలు అమలు చేయాలని పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. మనుషుల చట్టాలు, సరిహద్దు గీతలు ప్రకృతి జీవులకు వర్తించవనడానికి ఈ మంచు చిరుతల స్వేచ్ఛా విహారమే సజీవ సాక్ష్యంగా నిలుస్తోంది.














Click it and Unblock the Notifications