కడపలో దారుణమైన పాలిటిక్స్: బాబాయ్ గెలుపుపై జగన్కు అనుమానమా?
అమరావతి/కడప: కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నాడు ఆవేదన వ్యక్తం చేశారు.
అసెంబ్లీ అనంతరం ఆయన మీడియాతో పిచ్చాపాటిగా మాట్లాడారు. అసెంబ్లీని కౌరవసభగా మార్చే ప్రయత్నం చేస్తున్నారన్నారు. శాసనసభ జరిగిన తీరు కౌరవ సభను తలపించిందన్నారు.

కడపకు జగన్
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటువేసేందుకు తాను కడపకు వెళ్లనున్నట్టు చెప్పారు. కడప ఎమ్మెల్సీ ఎన్నికల్లో దారుణమైన రాజకీయాలు జరుగుతున్నాయన్నారు. తద్వారా ఆయన వైసిపి గెలుపుపై ధీమాగా లేరా అనే ప్రశ్న ఉదయిస్తోంది. ఇప్పటికే కడప ఎమ్మెల్సీ స్థానాన్ని తాము కైవసం చేసుకుంటామని టిడిపి ధీమాగా ఉంది. ఇప్పుడు జగన్ దారుణమైన రాజకీయాలు చేస్తున్నారని చెప్పడం గమనార్హం.

జిల్లాకు చేరిన వైసిపి ప్రజాప్రతినిధులు
వైసిపికి చెందిన ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు కౌన్సిలర్లు, కార్పొరేటర్లు బుధవారం రాత్రి జిల్లాలోని వేర్వేరు ప్రాంతాలకు చేరారు. స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నికల నేపథ్యంలో వైసిపికి చెందిన ప్రజాప్రతినిధులను ఆ పార్టీ నాయకులు కర్ణాటకకు తరలించారు.
దాదాపుగా నెల రోజుల పాటూ అక్కడ వేర్వేరు ప్రాంతాల్లో వారు శిబిరాలను ఏర్పాటు చేశారు. 17న (రేపు) ఎమ్మెల్సీ ఎన్నికల్లో వారు ఓటు వేయాల్సి ఉంది. పోలింగ్ గడువు సమీపించిన నేపథ్యంలో కర్ణాటకలోని శిబిరాలను కడప జిల్లాకు తరలించారు.

కర్నాటక నుంచి 14 బస్సుల్లో..
కర్ణాటక నుంచి వారు 14 బస్సుల్లో బుధవారం జిల్లాకు చేరుకున్నారు. కడప డివిజన్ ఓటర్లను నగరంలోని ఓ కల్యాణ మండపానికి చేర్చారు. జమ్మలమడుగు డివిజన్ ఓటర్లను ఇడుపులపాయకు చేర్చారు.
ఇక్కడ వేంపల్లె ఎంపీపీ రవికుమార్ రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. రాజంపేట డివిజన్ ఓటర్లను ఆకేపాడుకు తరలించారు. దీనితో వైసిపి పొరుగు రాష్ట్రాల్లో నిర్వహించిన శిబిరాలకు తెరపడింది. వైసిపి నాయకులు శుక్రవారం జరగనున్న పోలింగ్కు తమ ఓటర్లను సన్నద్ధం చేస్తున్నారు.

పుదుచ్చేరి నుంచి టిడిపి..
మరోవైపు, టిడిపి ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లను పుదుచ్చేరికి తరలించారు. అక్కడ శిబిరాలు ఏర్పాటు చేశారు. సభ్యులకు అక్కడే ఓటింగ్పై శిక్షణ ఇచ్చారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో పేపర్ బ్యాలెట్ మీద అంకెలు వేయటం ద్వారా ఓటును నమోదు చేయాల్సి ఉంటుంది. ఓటర్లలో పలువురికి ఈ విధానంపై అవగాహన లేదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రతి ఓటు అత్యంత కీలకం కాబట్టి అవగాహనలేని ఓటర్లను గుర్తించి వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు.












Click it and Unblock the Notifications