ఏపీలో 74 రోజులుగా ఇంత జరుగుతున్నా..: చరిత్ర హీనులు కావొద్దు: జగన్
మెగా డీఎస్సీ నియామకాల్లో చోటు చేసుకున్నట్లు భావిస్తోన్న అవకతవకలపై సీబీఐతో సమగ్ర విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్త నిరసన ర్యాలీలు చేపట్టింది. అన్ని నియోజకవర్గాల్లోనూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు వేల సంఖ్యలో తరలివచ్చారు. తమ నిరసన గళాన్ని ప్రభుత్వానికి వినిపించే ప్రయత్నం చేశారు.
దీనికి కొనసాగింపుగా పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ఏపీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు. డీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీ, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, ఈ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేశ్ రాజీనామా చేయాలని పునురుద్ఘాటించారు. ఫీజు రీయింబర్స్మెంట్ రూ.9,000 కోట్లు, వసతి దీవెన బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంటింటికీ రాసిచ్చిన బాండ్లల్లో పేర్కొన్న విధంగా, మేనిఫెస్టోలో చెప్పినట్టుగా నెలకు రూ.3,00 చొప్పున నిరుద్యోగ భృతి బకాయిలతో కలిపి చెల్లించాలని అన్నారు.

ఇంత స్పష్టంగా విద్యార్థులు, యువత, ప్రజలు చంద్రబాబును డిమాండ్ చేస్తోంటే.. వాటిని డైవర్ట్ చేస్తూ ఏపీ ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేయడం ఎంత వరకు సమంజసం అని అన్నారు. ప్రజలు అడుగుతున్న డిమాండ్లను అంగీకరిస్తారా, లేక కొడుకును కాపాడుకోవడం కోసం చరిత్ర హీనులుగా మిగిలిపోతారా అనేది తేల్చుకోవాల్సింది చంద్రబాబేనని చెప్పారు. ఈ మేరకు ఎక్స్లో ఓ పోస్ట్ పెట్టారు.. వైఎస్ జగన్.
రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన ర్యాలీల్లో లక్షలాదిగా విద్యార్థులు, యువకులు, నిరుద్యోగులు, ప్రజలు పాల్గొన్నారని గుర్తు చేశారు. తప్పు చేసిన ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తూ, స్ఫూర్తిదాయకంగా నిలిచారని అభినందించారు. విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తు కోసం గత రెండు నెలలుగా అన్ని వర్గాల మద్దతుతో పార్టీ నాయకులు, కార్యకర్తలు చేసిన పోరాటాలు చిరస్మరణీయంగా నిలిచిపోతాయని జగన్ ప్రశంసించారు.
చంద్రబాబు పాల్పడ్డ అధికార దుర్వినియోగానికి, రాజ్యాంగం ఇచ్చిన హక్కుల ఉల్లంఘనకు వ్యతిరేకంగా నిర్బంధాలు, బెదిరింపులు, నోటీసులను ఖాతరు చేయకుండా, నియంతృత్వానికి ఎదురొడ్డి.. ప్రజలతో కలిసి, లక్షలాది సంఖ్యలో బయటకు వచ్చి గట్టిగా పోరాటం చేశారని, నిర్బంధాలన్నింటినీ ఎదుర్కొంటూ, ప్రతి అడ్డంకినీ అధిగవిుస్తూ శాంతియుతంగా ఈ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లామని జగన్ హర్షం వ్యక్తం చేశారు.
74 రోజుల్లో గవర్నర్ను కలవడం మొదలుకుని రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నిర్వహించిన 10 కార్యక్రమాలు.. అశేష ప్రజానీకం మద్దతుతో అత్యంత విజయవంతం అయ్యాయని జగన్ పేర్కొన్నారు. ఈ ఏడాది మే నెల నుంచి ఇప్పటి వరకు చేపట్టిన కార్యక్రమాలను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. ఇన్ని కార్యక్రమాల ద్వారా లక్షల మంది ప్రశ్నించినా చంద్రబాబు నోరు మెదపట్లేదని, నారా లోకేశ్ సమాధానం చెప్పట్లేదని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
విద్యార్థులు, నిరుద్యోగులు, లక్షలాది కుటుంబాల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలపై సీఎంగా చంద్రబాబు, సంబంధిత మంత్రిగా ఆయన కుమారుడు నోరు విప్పక పోవడం దౌర్భాగ్యమని జగన్ మండిపడ్డారు. సమాధానాలు చెప్పకుండా ప్రశ్నించే గొంతులను పోలీసులతో అణచి వేయడం పరిష్కారం కాదని హితవు పలికారు. ఇది అధికార జులుంతో తప్పును కప్పిపుచ్చుకునే ప్రయత్నమే అవుతుందని పేర్కొన్నారు. జెన్ జీ ప్రశ్నలకు సమాధానాలు చెప్పితీరాల్సిందేనని, అంత వరకు పోరాటాలు ఆగవని అన్నారు.





Click it and Unblock the Notifications