మీకు ఏసీబీ ఉంటే మాకూ ఉందన్నాడు, బాబు సహా అందరి పేర్లు వస్తాయి: జగన్
అమరావతి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు పల్నాడు గనుల దోపిడీపై ఆదివారం సవాల్ విసిరారు.
పల్నాడు గనుల దోపిడీపై సీబీఐతో చంద్రబాబు గారు విచారణకు సిద్ధమా అని ట్వీట్ చేస్తూ.. ఇందుకు సంబంధించిన అంశాలు పొందుపర్చారు. పల్నాడు ప్రాంతంలో జరిగిన గనుల దోపిడీపై తన చేతిలోని సీబీసీఐడీతో కాకుండా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
శాటిలైట్ చిత్రం ఆధారంగా
జగన్ తన ట్విట్టర్లో... 'గుంటూరు జిల్లా పల్నాడు ప్రాంతంలో గనుల దోపిడీ కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగించడం వాస్తవాలను కప్పిపుచ్చడమే. అసలైన దోషులను రక్షించేందుకు చంద్రబాబు తన చేతిలో ఉన్న దర్యాఫ్తు సంస్థకు ఈ కేసును అప్పగించి పెద్ద తప్పును చిన్నతప్పుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. శాటిలైట్ చిత్రాల ఆధారంగా 2014 నుంచి కోటి మెట్రిక్ టన్నుల ఖనిజాన్ని దోపిడీ చేశారని తేలుతోంది.
ఎమ్మెల్యే నుంచి అందరికీ
ప్రతి రోజూ కొన్ని వేల లారీలను ఉపయోగించి ఖనిజాన్ని తరలించారు. ఇంత వ్యవహారం నడుస్తుంటే ఇన్నాళ్లుగా ఈ విషయం ఎవ్వరికీ తెలియదని అనుకోవాలా? ఎమ్మెల్యే నుంచి చినబాబు, పెదబాబు వరకూ ఈ దోపిడీలో భాగస్వాములు కాకుంటే ఇది జరిగేదా? రాష్ట్రంలో జరుగుతున్న అనేక దోపిడీల్లో ఇదొక దోపిడీ మాత్రమే'నని జగన్ పేర్కొన్నారు.
చంద్రబాబు చెప్పకనే చెప్పారు
'ఇసుక దగ్గరి నుంచి మొదలుపెడితే ఏ సహజ వనరులనూ మిగల్చలేదు. చంద్రబాబు తన చేతిలో ఉన్న సీఐడీతో విచారణ చేయిస్తే ఏం జరుగుతుంది? తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేను నల్లధనంతో కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో దొరికిపోయిన తర్వాత చంద్రబాబు అన్న మాటలను ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకోవాలి. మీకూ ఏసీబీ ఉంది. మాకూ ఏసీబీ ఉంది. మీకూ సీఐడీ ఉంది. మాకూ సీఐడీ ఉంది. మీకూ డీజీపీ ఉన్నాడు. మాకూ డీజీపీ ఉన్నాడని చంద్రబాబు వ్యాఖ్యానించలేదా? సీఐడీ తన చేతిలో ఉన్న సంస్థ అని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.' అని జగన్ పేర్కొన్నారు.
అందరి పేర్లు బయటకు వస్తాయి
పల్నాడు గనుల దోపిడీ వ్యవహారంలో అలాంటి వ్యక్తి సిఐడి చేత దర్యాఫ్తు చేయించడం అపహాస్యం కాదా అని జగన్ ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో లేని సీబీఐ లాంటి ఏజన్సీతోనే గనుల వ్యవహారంపై విచారణ జరిపించాలన్నారు. అప్పుడే నిజానిజాలు బయటకు వస్తాయన్నారు. ఎమ్మెల్యే దగ్గర నుంచి చినబాబు, పెదబాబు వరకూ పేర్లు బయటకు వస్తాయన్నారు.