మహిళల జోలికి ఎవరైనా రావాలంటే..
YS Jagan: కడప జిల్లా మైలవరం మండలం కంబాలదిన్నెలో ఓ చిన్నారిపై జరిగిన అత్యాచారం- హత్యోదంతంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఘటన పట్ల తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
కడప జిల్లా మైలవరం మండలంలో కంబాలదిన్నె గ్రామంలో ఇటీవలే మూడేళ్ల బాలికపై మోరగుడికి చెందిన దూదేకుల రహ్మతుల్లా అనే యువకుడు మద్యం మత్తులో అత్యాచారానికి ఒడిగట్టిన విషయం తెలిసిందే. ఈ ఘాతుకం బయటికి రాకూడదనే కారణంతో బాలికను దారుణంగా హత్య చేశాడు.

ఈ ఘటన పట్ల వైఎస్ జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వ వైఫల్యానికి ఇది నిదర్శనమని విమర్శించారు.
శాంతిభద్రతలను కాపాడటం, అక్రమ మద్యం అమ్మకాలను నిరోధించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు. రాష్ట్రంలో మద్యం విచ్చలవిడిగా దొరకడం, మత్తులో దుర్మార్గులు మహిళలు, బాలికలపై అత్యాచారాలు, హత్యలకు పాల్పడుతుండడంపై బాధిత కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర వీడట్లేదని ఆరోపించారు.
కంబాలదిన్నె గ్రామంలో ఓ దుర్మార్గుడు మద్యం సేవించి మూడేళ్ల చిన్నారిపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై హత్య చేశాడని ఆ బాలిక తల్లి కన్నీరుమున్నీరవుతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం బాధాకరమని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో దిశ యాప్, దిశ యాక్ట్, దిశ పోలీస్ స్టేషన్ల గురించి జగన్ ప్రస్తావించారు.
తమ ప్రభుత్వ హయాంలో దిశ యాప్ ఉండటం వల్ల మహిళల జోలికి ఎవరైనా రావాలంటే భయపడే పరిస్థితి ఉండేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో దిశ లేకపోవడం వల్ల మహిళల మానప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పటికైనా చిన్నారిని హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని జగన్ డిమాండ్ చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోన్నానని అన్నారు.












Click it and Unblock the Notifications