వైసీపీకి వచ్చే ఎన్నికల్లో బిగ్ లాస్ అక్కడే ! అసెంబ్లీలో ప్రజంటేషన్ వెనుక ? జగన్ వ్యూహమిదే!
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయిపోయింది. మరో ఏడాదిన్నరలో ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో వైసీపీకి ఎన్ని స్ధానాలు వస్తాయన్న దానిపై పలు సర్వే నివేదికలు హల్ చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేయించుకుంటూ క్షేత్రస్దాయిలో మార్పులు చేర్పులు చేస్తోంది. ఈ క్రమంలోనే వైసీపీ అత్యధికంగా సీట్లు నష్టపోయేది ఎక్కడనే దానిపైనా చర్చ జరుగుతోంది. ఏపీ అసెంబ్లీలో తాజాగా సీఎం జగన్ ఇచ్చిన ఓ వివరణ తర్వాత దీనికి కొంతమేర సమాధానం దొరికినట్లయింది.

వైసీపీ ఎన్నికల వ్యూహాలు
ఏపీలో మరో ఏడాదిన్నరలో జరిగే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే అధికార వైసీపీ వ్యూహప్రతివ్యూహాలు సిద్ధం చేసుకుంటోంది. ఇందులో భాగంగా క్షేత్రస్దాయి నుంచి ఎప్పటికప్పుడు సర్వే నివేదికలు కూడా తెప్పించుకుంటోంది. వీటి ఆధారంగా మార్పులు చేర్పులకు కూడా సిద్ధమవుతోంది. ఒకట్రెండు చోట్ల నిర్ణయాలు అమల్లో కూడా పెట్టేస్తోంది. దీంతో వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో కూడా భయాలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ సర్కార్ వచ్చే ఎన్నికల్లో ఎక్కువగా నష్టపోయేది ఎక్కడనే చర్చ కూడా మొదలైంది. అయితే దీనికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు ఒకే సమాధానం వినిపిస్తోంది. అదే అమరావతి.

అమరావతిలో వైసీపీకి చుక్కలు?
గత ఎన్నికల్లో అమరావతి (సీఆర్డీయే) పరిధిలోకి వచ్చే ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల్లోని 33 స్ధానాల్లో వైసీపీ ఏకంగా 29 సీట్లు గెల్చుకుంది. మారిన పరిస్దితుల్లో వైసీపీ సర్కార్ మూడు రాజధానుల్ని తెరపైకి తెచ్చిన తర్వాత ఈసారి వాటిలో ఎన్ని నిలబెట్టుకోబోతోందన్న చర్చ ఇప్పుడు జరుగుతోంది. ముఖ్యంగా అమరావతి ఆందోళనల్ని ఎక్కడికక్కడ అణగదొక్కేలా వ్యవహరిస్తున్న వైసీపీ పట్ల ఈ ప్రాంత ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. దీంతో అమరావతి పరిధిలోకి వచ్చే పలు సీట్లలో సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో పలువురిని మార్చేసేందుకు కూడా వైసీపీ సిద్ధమవుతోంది. తద్వారా వ్యతిరేకతను కాస్తయినా అధిగమించవచ్చనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆయా సీట్లలో ఎమ్మెల్యేలు కూడా మరోసారి తాము గెలుస్తామన్న ధీమా సడలిపోతోందనే చెప్తున్నారు.

అసెంబ్లీలో జగన్ ప్రజంటేషన్
ఈ తరుణంలో అసెంబ్లీలో సీఎం జగన్ తాజాగా అభివృద్ది వికేంద్రీకరణపై సుదీర్ఘ ప్రసంగం చేసారు. ఇందులో భాగంగా సీఎం జగన్ ఓ పవర్ పాయింట్ ప్రజంటేషన్ కూడా ఇచ్చారు. ఇందులో విజయవాడతోపాటు అమరావతి ప్రాంతంలో తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాల్ని ఫొటోలతో సహా ఏకరువు పెట్టారు. ఇందులో కేంద్రం నిర్మించి ఇచ్చిన ఫ్లైఓవర్లు, బైపాస్ రోడ్లను కూడా కలిపేశారు.
తద్వారా తమ ప్రభుత్వం అమరావతిని నిర్లక్ష్యం చేయడం లేదనేలా ఓ సంకేతాన్ని జనంలోకి పంపేందుకు ప్రయత్నించారు. కానీ ఇక్కడ వాస్తవమేంటో స్ధానికంగా ఉండే జనానికి ఎలాగో తెలుసు. మరి అటువంటప్పుడు జగన్ ప్రజంటేషన్ ఉద్దేశమేంటి ?

జగన్ వ్యూహం అదే?
గతానికి భిన్నంగా ఈసారి అమరావతిలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల గురించిన జగన్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజంటేషన్ గమనిస్తే రెండు విషయాలు అర్ధమవుతున్నాయి. ఇందులో మొదటికి అమరావతిని జగన్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తోందన్న వాదన ఇక్కడే ఉన్న ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల ప్రజల్లోకి విపక్షాలు ఎక్కిస్తున్నాయి.
దీంతో ఇప్పుడు ఇది అమరావతి రైతుల పాదయాత్ర, విపక్షాల ప్రచారం రూపంలో మిగతా ప్రాంతాలకు కూడా పాకుతోంది. ఈ నేపథ్యంలో విజయవాడలో లేదా అమరావతిలో తాము చేసిన పనుల్ని అసెంబ్లీలో చూపడం ద్వారా అమరావతిపై నిర్లక్ష్యం లేదని చెప్పుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. తద్వారా రాజధాని పరిధిలోని ఈ అభివృద్ధి తెలియని ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను కాస్తయినా తగ్గించుకోవచ్చనేది జగన్ వ్యూహంగా కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications