ఇకనైనా మారండి: బాబు, కెసిఆర్ వైఖరికి నిరసనగా జగన్ 3రోజుల నిరాహార దీక్ష
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న దిండి, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా మూడు రోజులపాటు నిరాహార దీక్ష చేయనున్నట్లు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి చెప్పారు. మే 16, 17, 18 తేదీల్లో కర్నూలులో దీక్ష చేపట్టనున్నట్లు తెలిపారు.
శనివారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కరువు తాండవిస్తోందని తెలిపారు. కరువు నివారించేందుకు చంద్రబాబునాయుడు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని మండిపడ్డారు. పాలమూరు, రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల ప్రాజెక్టులను తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్నప్పటికీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావును చంద్రబాబు నిలదీసే పరిస్థితిలో లేడని అన్నారు.
ఈ ప్రాజెక్టుల ద్వారా 115టిఎంసీల నీళ్లు కెసిఆర్ తీసుకుపోతున్నారని, చంద్రబాబు ఎలాంటి పోరాటం చేయడం లేదని, నిలదీయడం లేదని ఆరోపించారు. మహబూబ్ నగర్ నుంచే శ్రీశైలం ప్రాజెక్టుకు నీళ్లు వస్తాయని అందరికీ తెలిసిన విషయమేనని.. అయితే పాలమూరు ప్రాజెక్టుతో శ్రీశైలానికి, నాగార్జున సాగర్కు తగినన్ని నీళ్లు రావని చెప్పారు. దీంతో రాయలసీమ, నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలు కరువు పరిస్థితిని ఎదుర్కొంటున్నాయని చెప్పారు.

తెలంగాణలోని నల్గొండ, ఖమ్మం జిల్లాలకు కూడా నీరు అందని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. అయితే, ఈ ప్రాజెక్టులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని జగన్ ప్రశ్నించారు. ఆయనకు ఆ పరిస్థితి లేదని చెప్పారు.
ఇలా అయితే, కృష్ణా డెల్టాను ఎలా కాపాడుకోగల్గుతామని అన్నారు. చంద్రబాబు పట్టిసీమ అంటున్నారని, దానికి స్టోరేజీ కెపాసిటీనే లేదని చెప్పారు.
తెలంగాణ నుంచి మిగులు జలాలు మాత్రమే ఏపీకి వస్తాయని, వాటిని నిల్వ చేసుకోవాలని అన్నారు. 190టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయని జగన్ ఆరోపించారు. అయినా, పోలవరం కాంట్రాక్టర్లను చంద్రబాబు మార్చడం లేదని అన్నారు. పోలవరం స్కాముల ప్రాజెక్టుగా మారిందని అన్నారు.
ప్రస్తుతం పెట్రోల్, డీజీల్, సిమెంట్, ఇసుక, స్టీలు ధరలు తగ్గినా రూ. 4వేల కోట్ల నుంచి 7వేల కోట్లకు ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారని ఆరోపించారు. కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోకుండా.. వారికి మొబైల్ అడ్వాన్స్ లు కూడా ఇచ్చారని చంద్రబాబుపై మండిపడ్డారు. శ్రీశైలంలో నీళ్లుంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయని అన్నారు. శ్రీశైలంలో 854 అడుగుల మేర నీరుంటేనే సీమకు నీళ్లు వస్తాయని, ప్రస్తుతం 780 అడుగుల మేర మాత్రమే నీళ్లున్నాయని చెప్పారు.
శ్రీశైలం నిండేదెప్పుడూ.. సీమకు నీళ్లొచ్చేదెప్పుడు అని జగన్ ప్రశ్నించారు. పోలవరం ప్రాజెక్టును చంద్రబాబు నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. నీటి విభజన సరిగా జరగాలంటే కృష్ణా, గోదావరి ప్రాజెక్టుల మీద బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డెల్టా ఆయకట్టు, గోదావరి నీటి పరిష్కారం చూపించాలని కేంద్రాన్ని కోరారు.
చంద్రబాబునాయుడు వైఖరికి నిరసనగా, తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న దిండి, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టులకు వ్యతిరేకంగా తాను మే 16, 17, 18న కర్నూలులో స్వయంగా తానే నిరాహార దీక్ష చేపడతానని వైయస్ జగన్ తెలిపారు. ఈ దీక్షతో కేంద్రానికి తమకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజేస్తామని చెప్పారు.
అక్కడున్న వారు మనుషులే.. ఇక్కడున్న వారు మనుషులే.. ఇక్కుడన్న వారికి కూడా నీళ్లు కావాలని తెలంగాణ, ఏపీలనుద్దేశించి జగన్ అన్నారు. కేసీఆర్, రాజకీయాలు పక్కన పెట్టి చంద్రబాబు మనుషులుగా ఆలోచించాలని, కేంద్రం ఆలోచనలో మార్పు రావాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అడ్డగోలుగా నీళ్ల మళ్లింపునకు నిరసనగానే దీక్ష చేస్తున్నాని స్పష్టం చేశారు. తన తప్పుకుంటే సరిదిద్దుకుంటానని, తప్పులేకుంటే తనకు సహకరించాలని కోరారు.












Click it and Unblock the Notifications