సచివాలయాల ఉద్యోగులకు వైఎస్ జగన్ గుడ్ న్యూస్..
ఏపీలో వైసీపీ ప్రభుత్వ మానస పుత్రిక అయిన సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు సీఎం జగన్ ఇవాళ మరో గుడ్ న్యూస్ చెప్పారు. ఉద్యోగుల నుంచి వచ్చిన ఓ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం.. ఇవాళ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని సచివాలయ ఉద్యోగుల సంఘం నేతలకు అధికారులు వెల్లడించారు. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై వారు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రంలో సాధారణ ఉద్యోగుల బదిలీలతో పాటు గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల్ని కూడా మే నెలలో బదిలీ అయ్యేందుకు అవకాశం కల్పించాలని ప్రభుత్వం నిర్ణయించింది. పైరవీలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు మే నెలలో బదిలీలు ఉంటాయని ఇవాళ ఉద్యోగ సంఘాల నేతలకు గ్రామ వార్డు సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్ స్పష్టత ఇచ్చారు.

ఇవాళ సచివాలయంలో ఉద్యోగ నేతలతో అజయ్ జైన్ భేటీ అయ్యారు. ఇందులో సచివాలయ ఉద్యోగుల వివిధ సమస్యల పై చర్చించిన రాష్ట్ర ఉద్యోగ నేతలు.. సచివాలయ ఉద్యోగులకు తప్పనిసరిగా బదిలీలు కల్పించాలని,ఇప్పటికే 100 సార్లు వివిధ సందర్భాల్లో అధికారులు,ప్రభుత్వ పెద్దలు, మరియు ముఖ్యమంత్రివర్యులకు వినతులు అందించామని తప్పనిసరిగా బదిలీలు కల్పించాలని సమావేశంలో కోరారు. అలాగే మూడున్నర సంవత్సరాలుగా బదిలీల కోసం సచివాలయ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలు ముఖ్యంగా మహిళా ఉద్యోగుల సమస్యలు,వారి దృష్టికి తీసుకెళ్లారు.
దీనిపై సానుకూలంగా స్పందించిన స్పెషల్ చీఫ్ సెక్రటరీ అజయ్ జైన్.. ఉద్యోగాలు ఎంత పారదర్శకంగా కల్పించడం జరిగిందో అంతే పారదర్శకంగా ఎటువంటి పైరవీలకు తావులేకుండా బదిలీలు కల్పిస్తామని,పాత జిల్లాల ప్రాతి పదికన బదిలీలు కల్పిస్తామని,రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి బదిలీలకు అవకాశం కల్పిస్తామని మిగిలిన అన్నీ సమస్యలపై తప్పనిసరిగా పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటామని,బదిలీల కోసం ప్రత్యేకంగా వెబ్ పోర్టల్ రూపొందిస్తామని హామీ ఇచ్చారు. బదిలీల ప్రక్రియ అనంతరం నోషనల్ ఇంక్రిమెంట్ల అంశం పరిశీలిస్తామని తెలిపారని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.డి.జాని పాషా తెలిపారు.












Click it and Unblock the Notifications