నిరుద్యోగులకు జగన్ గుడ్ న్యూస్- వెంటనే 8 వేల పోస్టుల భర్తీ- త్వరలో ప్రకటన
ఏపీలో ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగాలకు సీఎం జగన్ ఇవాళ గుడ్ న్యూస్ చెప్పారు. ఒకేసారి 8 వేల ఉద్యోగాలను భర్తీ చేసేందుకు వీలుగా ఆదేశాలు ఇచ్చారు. దీంతో అధికారులు ఇందుకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై దృష్టిపెడుతున్నారు. అలాగే ఉన్నత విద్యలో ఖాళీలపైా దృష్టిపెట్టాలని జగన్ ఆదేశించారు.
ఈ ఏడాది జాబ్ క్యాలెండర్పై క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఏడాది కాలంగా జరిగిన రిక్రూట్మెంట్, ఇంకా భర్తీచేయాల్సిన పోస్టులపై అధికారులతో సమగ్రంగా సమీక్షించిన సీఎంకు..జాబ్ క్యాలెండర్లో భాగంగా రిక్రూట్ చేసిన పోస్టుల వివరాలను అధికారులు అందజేశారు.బ్యాక్లాక్ పోస్టులు, ఏపీపీఎస్సీ, వైద్య, ఆరోగ్య - కుటుంబ సంక్షేమశాఖ, ఉన్నత విద్య తదితర శాఖల్లో జరిగిన, జరుగుతున్న రిక్రూట్ మెంట్ను సీఎం సమగ్రంగా సమీక్షించారు.
2021-22 ఏడాదిలో 39,654 పోస్టులను భర్తీచేసినట్టుగా అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఒక్క వైద్య ఆరోగ్యశాఖలోనే 39,310 పోస్టులు భర్తీ చేశామన్నారు. గుర్తించిన 47,465 పోస్టుల్లో 83.5 శాతం పోస్టుల రిక్రూట్మెంట్ ఈ ఒక్క ఏడాదిలో పూర్తి చేశామన్నారు. 16.5శాతం పోస్టులను, అంటే సుమారు 8వేల పోస్టులు ఇంకా భర్తీచేయాల్సి ఉందని సీఎంకు తెలిపారు. భర్తీచేయాల్సిన పోస్టుల్లో 1198 పోస్టులు వైద్య ఆరోగ్యశాఖలోనే ఉన్నాయని తెలిపారు. దీంతో ఆ మిగిలిన 8 వేల పోస్టుల్ని వెంటనే భర్తీ చేయాలని సీఎం జగన్ ఆదేశాలు ఇచ్చారు.
ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.26లక్షలమందికి పర్మినెంట్ ఉద్యోగాలు ఇచ్చామని, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంద్వారా మరో 50వేలమందిని ప్రభుత్వంలోకి తీసుకున్నామని సీఎం తెలిపారు. ఇలా పలు శాఖల్లో పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన జరిగిందన్నారు. జాబ్ క్యాలెండర్లో నిర్దేశించుకున్న పోస్టుల్లో ఇంకా భర్తీ కాకుండా మిగిలిన పోస్టుల రిక్రూట్మెంట్పై కార్యాచరణ రూపొందించుకోవాలని సీఎం జగన్ సూచించారు. వైద్య ఆరోగ్యశాఖలో మిగిలిన పోస్టులను ఈ నెలాఖరులోగా, ఉన్నత విద్యాశాఖలో అసిసోయేట్ ప్రొఫెసర్ పోస్టులను సెప్టెంబరులోగా, ఏపీపీఎస్సీలో పోస్టులను మార్చిలోగా భర్తీచేయాలన్నారు.

విద్యా, వైద్యంపై చాలా డబ్బు వెచ్చించి ఆస్పత్రులు, విద్యాలయాలు కడుతున్నామని జగన్ అధికారులకు చెప్పారు.
ఇక్కడ ఖాళీలు భర్తీచేయకపోవడం సరికాదన్నారు. భర్తీ చేయకపోతే వాటి ప్రయోజనాలు ప్రజలకు అందవన్నారు. ఉన్నతవిద్యలో టీచింగ్ పోస్టుల భర్తీలో పారదర్శకత, సమర్థతకు పెద్దపీటవేసేలా నిర్ణయాలు ఉండాలని స్పష్టంచేశారు.రెగ్యులర్పోస్టులు అయినా, కాంట్రాక్టు పోస్టులు అయినా పారదర్శకంగా నియమకాలు జరగాలన్నారు.
దీనికోసం ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే పోలీస్ రిక్రూట్మెంట్పై యాక్షన్ప్లాన్ రూపొందించాలన్నారు. పోలీసు విభాగం, ఆర్థికశాఖ అధికారులు కూర్చొని వీలైనంత త్వరగా యాక్షన్ ప్లాన్ రూపొందించుకోవాలన్నారు. వచ్చే నెల మొదటివారంలో తనకు నివేదించాలని జగన్ సూచించారు. కార్యాచరణ ప్రకారం క్రమం తప్పకుండా పోలీసు ఉద్యోగాల భర్తీ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చారు.












Click it and Unblock the Notifications