ఎగ్జిట్ పోల్స్ వేళ జగన్ ఈజ్ బ్యాక్.. ఫలితాలపై పక్కా స్ట్రాటజీతో వైసీపీ బాస్!!
ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగిసింది. నేడు ఉదయం మళ్ళీ ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఈరోజు సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ విడుదల కానున్న నేపథ్యంతో పాటు, ఎన్నికల తుది ఫలితాలకు సమయం దగ్గర పడిన తరుణంలో బాస్ ఈజ్ బ్యాక్ అన్నట్టు జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకుని వచ్చారు.
ఏపీ చేరుకున్న వైఎస్ జగన్
శనివారం ఉదయం కుటుంబ సభ్యులతో సహా ఆయన రాష్ట్రానికి చేరుకున్నారు. ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి గన్నవరం ఎయిర్పోర్ట్ దగ్గర , రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు నేతలు ఘనస్వాగతం తెలిపారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు, నేతలు సీఎం జగన్మోహన్ రెడ్డిని స్వాగతించారు. ఆపై ఆయన ఇక్కడి నుండి నేరుగా తాడేపల్లి నివాసానికి చేరుకున్నారు.

కౌంటింగ్ పై పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం
ఏపీ ఎన్నికల పోలింగ్ పూర్తయిన తర్వాత సీఎం జగన్మోహన్ రెడ్డి తన కుటుంబంతో మే నెల 17వ తేదీన విదేశీ పర్యటనకు వెళ్లారు. లండన్, స్విట్జర్లాండ్ దేశాలలో పర్యటించిన ఆయన 15 రోజుల పాటు కుటుంబంతో గడిపారు. ఇక నేటి నుంచి మళ్లీ రాజకీయాలలో బిజీ కానున్నారు. జూన్ 4వ తేదీన కౌంటింగ్ జరగనున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు.
విదేశాలలో ఉన్న సమయంలో జగన్ ట్వీట్
విదేశాలలో ఉన్న సమయంలో కూడా సీఎం జగన్ ఏపీ రాజకీయాల పైన తనదైన ట్వీట్ చేశారు. ఐదేళ్ల క్రితం తాను సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన, పాలనా పగ్గాలు చేపట్టిన రోజును గుర్తు చేసుకుని ఆయన ఎక్స్ వేదికగా సంచలన ట్వీట్ చేశారు.దేవుడి దయ, ప్రజలిచ్చిన చారిత్రాత్మక తీర్పుతో సరిగ్గా ఐదేళ్ల కిందట ఇదే రోజన (మే 30న) మన పార్టీ అధికారంలోకి వచ్చిందని పేర్కొన్నారు.
విదేశీ పర్యటన అనంతరం గన్నవరం కు చేరుకున్న సీఎం జగన్ కు స్వాగతం పలికిన మంత్రులు, ఎమ్మెల్యేలు..!!#YSJagan #YSRCP #Oneindiatelugu pic.twitter.com/kyK08idoBS
— oneindiatelugu (@oneindiatelugu) June 1, 2024
మళ్ళీ ప్రజలు వైసీపీ కే పట్టం కడతారన్న జగన్
కులం, మతం, ప్రాంతం, రాజకీయాలు చూడకుండా ప్రతి కుటుంబానికీ మంచి చేసింది. ప్రజలందరి దీవెనలతో మళ్లీ ఏర్పాటుకానున్న మన ప్రభుత్వం ఇదే మంచిని కొనసాగిస్తూ రాష్ట్ర సమగ్రాభివృద్ధి దిశగా మరిన్ని అడుగులు ముందుకేస్తుంది అని జగన్ ట్వీట్ చేశారు.ఈ ఎన్నికలలో ఘనవిజయాన్ని సాధిస్తానని జగన్ బలంగా నమ్ముతున్నారు. ఏపీ ప్రజలు తనకే పట్టం కట్టారని విశ్వసిస్తున్నారు.
నేడే ఎగ్జిట్ పోల్స్.. జగన్ ఏం చేస్తారో ?
అయితే జగన్ ఇంతగా విశ్వాసం చూపించడం వెనుక కచ్చితంగా రిజల్ట్స్ తెలుసన్న ఉద్దేశం కాదని, పార్టీ శ్రేణులు పక్కచూపులు చూడకుండా, పార్టీ బలహీనం కాకుండా చూసుకునే క్రమంలోనే ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఏపీ ఫలితాలపైన భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న వేళ, నేడు ఎగ్జిట్ పోల్స్ రానున్న నేపథ్యంలో ఏపీ ప్రజలు ఎవరికి పట్టం కట్టబోతున్నారు? జగన్ ఏం చేయబోతున్నారు? అన్నది ఆసక్తిగా మారింది.












Click it and Unblock the Notifications