జగన్ తో ఉద్యోగ నేతల భేటీ- వారిని నమ్మొద్దు -సీఎం కీలక వ్యాఖ్యలు...!
ఏపీలో పలు ఉద్యోగ సంఘాల నేతలు ఇవాళ సీఎం వైఎస్ జగన్ తో భేటీ అయ్యాయి. సీఎం క్యాంపు కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో సీఎంతో పలు విషయాలపై చర్చించారు. అలాగా తాజాగా జరిగిన కేబినెట్ భేటీలో ఉద్యోగుల విషయంలో తీసుకున్న నిర్ణయాలపై కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం వారితో మాట్లాడిన సీఎం జగన్.. ఉద్యోగుల విషయంలో తాము పడుతున్న తపనను వారికి వివరించారు.
ఇవాళ ముఖ్యమంత్రిని కలిసిన వారిలో పలు ప్రభుత్వ విభాగాలకు చెందిన ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. ఉద్యోగులకు సంబంధించిన అంశాల్లో కేబినెట్ నిర్ణయాలపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తంచేశాయి. ముఖ్యంగా జీపీఎస్ అమలు నిర్ణయం పట్ల ఉద్యోగ సంఘాలు సంతోషం వ్యక్తం చేశాయి. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి జగన్.. ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం చేస్తున్న కృషిని వారికి తెలిపారు.

ఉద్యోగులు సంతోషంగా ఉంటేనే డెలివరీ మెకానిజం బాగుంటుందని, ప్రజలు సంతోషంగా ఉంటారని సీఎం జగన్ తెలిపారు.మిమ్మల్ని సంతోషంగా ఉంచడానికి ప్రతి కార్యక్రమం మనాసా, వాచా కర్మేణా చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. రాజకీయ కారణాలతో ఎవరైనా ఏదైనా చెప్పినా వాటిని విశ్వసించనక్కర్లేదన్నారు. ఉద్యోగులకు బాగుండాలని చిత్తశుద్ధితో ప్రయత్నిస్తున్నామన్నారు. ఉద్యోగుల సమస్యలను వదిలేయకుండా.. ప్రతి సమస్యకూ ఒక పరిష్కారం చూపించాలని ప్రయత్నిస్తున్నామన్నారు.

ఉద్యోగులకూ మంచి జరగాలని, రాష్ట్ర ప్రభుత్వానికీ మంచి జరగాలని ఆలోచన చేశామని జగన్ తెలిపారు. జీపీఎస్ కోసం రెండు సంవత్సరాలు కసరత్తు చేశామని, ద్రవ్యోల్బణాన్ని కూడా పరిగణలోకి తీసుకుని డీఆర్లు జీపీఎస్లో ఇస్తున్నామని జగన్ గుర్తుచేశారు. జీపీఎస్ అన్నది దేశానికే రోల్ మోడల్ అవుతుందన్నారు. దీంతో రిటైర్ అయిన ఉద్యోగుల జీవన ప్రమాణాలను కాపాడినట్టు అవుతుందన్నారు. ఉద్యోగులకు సంబంధించి కేబినెట్ నిర్ణయాలన్నీ కూడా 60 రోజుల్లోగా అమల్లోకి రావాలన్నారు.ఎక్కడా జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని, రోజువారీ వేతనాలు తీసుకునే ఉద్యోగుల్నీ ఆప్కాస్ పరిధిలోకి తేవాలన్నారు.












Click it and Unblock the Notifications