అమరావతిలో ఇళ్ల స్ధలాలు, ఇళ్ల నిర్మాణంపై వైఎస్ జగన్ కీలక ఆదేశాలు..
ఏపీలో గృహనిర్మాణశాఖపై సీఎం వైయస్.జగన్ ఇవాళ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో నవరత్నాలు పేదలందరికీ ఇళ్లు కార్యక్రమంతో పాటు టిడ్కో ఇళ్లు, ఇతర అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాజధాని ప్రాంతంలో ఆర్ 5 జోన్ ఏర్పాటు చేసి ఇస్తున్న ఇళ్ల స్ధలాలతో పాటు టిడ్కో ఇళ్ల పంపిణీపైనా అధికారుల నుంచి జగన్ వివరాలు తీసుకున్నారు. వీటిపై సత్వర చర్యలు తీసుకోవాలని సూచించారు.
గత 45 రోజుల్లో హౌసింగ్ కోసం రూ.1085 కోట్లు ఖర్చు చేసినట్లు అధికారులు సీఎం జగన్ కు తెలిపారు. ఇప్పటివరకూ 3.70 లక్షల ఇళ్లు పూర్తి చేసినట్లు వెల్లడించారు. రూఫ్ లెవల్.. ఆపైన నిర్మాణంలో ఉన్నవి 5.01లక్షల ఇళ్లుగా తెలిపారు. త్వరలోనే వీటి నిర్మాణం పూర్తవుతుందన్నారు. మరో 45 రోజుల్లో వీటిని పూర్తిచేస్తామన్నారు. బేస్మెంట్ లెవల్ దాటి వివిధ దశల్లో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 8.64లక్షలుపైనే అన్నారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ అధికారులకు అమరావతిలో పేదల ఇళ్ల స్ధలాలు, వాటిలో ఇళ్ల నిర్మాణంపై కీలక ఆదేశాలు ఇచ్చారు. సీఆర్డీయే ప్రాంతంలో పేదలకు ఇళ్లనిర్మాణ పనులు వేగంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం జగన్ ఆదేశించారు. ఇళ్లపట్టాలు పంపిణీ చేసిన తర్వాత వేగంగా నిర్మాణ పనులును ముందుకు తీసుకెళ్లేలా కార్యాచరణ చేయాలన్నారు. ఇళ్లులేని నిరుపేదలకు సాధ్యమైనంత త్వరగా ఇళ్లు కట్టించి అప్పగించడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. పేదలకు ఎంతత్వరగా ఇళ్లు సమకూరిస్తే.. వారి జీవితాలు అంతగా బాగుపడతాయన్నారు.
సీఆర్డీయే ప్రాంతంలో పట్టాల పంపిణికీ అన్నిరకాల చర్యలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా అధికారులు సీఎం జగన్ కు వివరించారు. ఇప్పటికే ల్యాండ్ లెవలింగ్ పనులు చేసినట్లు వివరించారు. సీఆర్డీయే ప్రాంతంలో ఇళ్లపట్టాల పంపిణీ కార్యక్రమంతో పాటుగా నిర్మించిన టిడ్కో ఇళ్లను కూడా పంపిణీచేసేందుకు అన్ని ఏర్పాట్లూ చేయాలని సీఎం ఆదేశించారు.సీఆర్డీయే పరిధిలో ప్రభుత్వం 5024 టిడ్కో ఇళ్లను అందించనుంది.












Click it and Unblock the Notifications