వివేకా హత్య కేసుపై వైసీపీ నేతలకు జగన్ కీలక సూచనలు.. ?
ఏపీలో మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై సీబీఐ జరుపుతున్న దర్యాప్తు, కోర్టుల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలతో పాటు రాజకీయ వర్గాల్లోనూ దీనిపై ఆసక్తి పెరుగుతోంది. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన పలువురు నేతలు తాజాగా జరిగిన వైఎస్ భాస్కర్ రెడ్డి అరెస్టు, వైఎస్ అవినాష్ రెడ్డి విచారణపై చేస్తున్న వ్యాఖ్యలు పార్టీని ఇరకాటంలోకి నెడుతున్నట్లు తెలుస్తోంది.
వైఎస్ వివేకా హత్య కేసు విషయంలో వైసీపీ మంత్రి ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్దితో పాటు మరికొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాల్ని మీడియా ముందు వ్యక్తం చేస్తున్నారు. ఇందులో అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పార్టీ నుంచి తిరిగి వారికి ఫోన్ కాల్స్ రావడం, ఆ తర్వాత మళ్లీ తిరిగి మాట్లాడటం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు.

వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు, కోర్టుల్లో పరిణామాలపై రెండు రోజులుగా పార్టీలో కీలక నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్న సీఎం వైఎస్ జగన్ వైసీపీ తరఫున ఎలా స్పందించాలన్న దానిపై దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా భాస్కర్ రెడ్డి అరెస్టు తర్వాత పులివెందులలో శాంతియుత ర్యాలీలు చేపట్టడం ఇందులో భాగమే. ఇదే క్రమంలో రేపు మరిన్ని కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చని అంచనా వేస్తున్న జగన్.. పార్టీ నేతలకు కీలక సూచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
వివేకా హత్య, అరెస్ట్ లకు సంబంధించి ప్రకటనలు చేసేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని సీఎం జగన్ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. అలాగే సమాచారం లేకుండా అరెస్ట్ ల అంశంపై మాట్లాడవద్దని ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ కూడా ముఖ్య నేతలతో సీఎం జగన్ చర్చలు జరుపుతున్నారు. అలాగే అవసరాన్ని బట్టి ఢిల్లీ వెళ్లే ఆలోచనలో కూడా సీఎం జగన్ ఉన్నట్లు సమాచారం. దీనిపై పార్టీ నేతలకు ఎప్పటికప్పుడు సూచనలు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications