చంద్రబాబుకు ధైర్యంలేదు, అందుకే తగ్గారు: హోదాపై ఏకేసిన జగన్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే నీరుగార్చుతున్నారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. ప్రత్యేక హోదా అవసరం లేదన్నట్లుగా ఓ కేంద్రమంత్రి మాట్లాడటంపై జగన్ స్పందిచారు. ఆయన మాటలకు కారణం ఏమిటని, ఇది ధర్మమేనా? అని ఆయన ప్రశ్నించారు.
శనివారం జగన్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హోదా గురించి అడిగే నాథుడే కరువయ్యాడని అన్నారు. హోదా వస్తుందా? రాదా? అని ప్రశ్నించారు. చంద్రబాబునాయుడు, బిజెపి సహకారంతో కాంగ్రెస్ రాష్ట్రాన్ని విడగొట్టిందని అన్నారు. ఆ సమయంలో ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని హామి ఇచ్చారని గుర్తు చేశారు.
ఎన్నికల మానిఫెస్టోలో కూడా ప్రత్యేక హోదాను పెట్టారని అన్నారు. ఐదేళ్లు కాదు, పదేళ్లు హోదా ఇస్తామని ప్రచారం చేశారని చెప్పారు. హోదా రాని కారణంగా రాష్ట్రంలో పరిశ్రమలు వచ్చే పరిస్థితి లేదన్నారు. హోదా ఉంటే పారిశ్రామిక వేత్తలు ఇన్కం టాక్స్ కట్టనవసరం లేదని, కరెంటు కూడా సబ్సిడీకే ఇవ్వడం జరుగుతుందని, ట్రాన్స్ పోర్ట్ ఖర్చులు కూడా సగం రీఎంబర్స్ మెంట్ వర్తిస్తుందని చెప్పారు.
హోదా వస్తే ఇవన్ని ఉంటాయని, దీంతో పరిశ్రమల అభివృద్ధి బాగా జరుగుతుందని వెల్లడించారు. చంద్రబాబునాయుడు పారిశ్రామికవేత్తల చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదని చెప్పారు. పారిశ్రామికవేత్తలే క్యూ కడతారని తెలిపారు. ఇవన్నీ తెలిసినా చంద్రబాబు, కేంద్రం తమ జీవితాలతో చెలగాటమాడుతోందని అన్నారు.
ప్రధాని నరేంద్ర మోడీ, చంద్రబాబు పదేళ్లపాటు హోదా ఇస్తామని తమ ప్రసంగాల్లో చెప్పుకున్నారని, ఇప్పుడు దాని ఊసేత్తడం లేదని మండిపడ్డారు. హోదా సంజీవని ఏమీ కాదని చంద్రబాబు అంటున్నారని అన్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారని జగన్ అన్నారు.
చంద్రబాబే హోదా అవసరం లేదంటున్నారు కాబట్టే, కేంద్రమంత్రి పార్లమెంటు సాక్షిగా ప్రకటన చేశారని జగన్ చెప్పారు. చంద్రబాబు రాష్ట్రాన్ని పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. కేంద్రాన్ని నిలదీయడం లేదెందుకని జగన్ ప్రశ్నించారు. రైల్వేజోన్, పోలవరం హామీలు జరగని పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో టిడిపి కేంద్రమంత్రులతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రాన్ని అమ్మేశాడని మండిపడ్డారు. ఓటుకు నోటు కేసులో నిందితుడైన చంద్రబాబు.. కేసుల నుంచి తప్పించుకోవడానికే కేంద్రాన్ని నిలదీయడం లేదని అన్నారు. అవినీతి కేసుల నుంచి తప్పించుకునేందుకే ఇలా వ్యవహరిస్తున్నారని చంద్రబాబుపై వైయస్ జగన్ మండిపడ్డారు.
గతంలో 5కాదు, 15ఏళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేసిన చంద్రబాబు ఇప్పుడు మాటమారుస్తున్నారని ఆరోపించిన జగన్.. వరుస వీడియోలను ప్లే చేయించారు. హోదాపై కేంద్రాన్ని నిలదీస్తామని చెప్పిన చంద్రబాబు.. ఇప్పుడు ప్రధానిని అడిగే ధైర్యం లేని పరిస్థితిలో ఉన్నారని అన్నారు.