జగన్ మెచ్చిన కూనవరం ఎస్సై-ఏకంగా మెడల్ కే సీఎం సిఫార్సు...
ఏపీలో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక నేరుగా అధికారుల్ని బహిరంగంగా అభినందించిన సందర్భాలు చాలా తక్కువే. అలాంటిది ఇవాళ పోలవరం టూర్ సందర్భంగా ఈ అరుదైన అవకాశాన్ని ఓ సబ్ ఇన్ స్పెక్టర్ అందిపుచ్చుకున్నారు. సీఎం పోలవరం టూర్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. అంతగా రాష్ట్ర ముఖ్యమంత్రి అభినందనలు అందుకున్న ఆ ఎస్సై పేరు వెంకటేష్. ఆయన పనిచేస్తున్న ప్రాంతం కూనవరం.
అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరంలో ఇవాళ సీఎం జగన్ పర్యటించారు. తాజాగా వచ్చిన గోదావరి వరదల్లో ముంపుకు గురైన పలు ప్రాంతాల్ని సీఎం జగన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బాధితులకు సీఎం జగన్ భరోసా ఇచ్చారు. అనంతరం స్ధానికులతో కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీఎం దృష్టికి ఓ అంశం వచ్చింది. దీంతో ఆయన కూడా అంతే వేగంగా దానిపై స్పందించారు. స్ధానికుల స్పందనతో సమానంగా తాను కూడా స్పందించారు.

గత ఏడాది, ఈఏడాది వచ్చిన గోదావరి వరదల్లో సాహసోపేతంగా రెస్క్యూ ఆపరేషన్స్ నిర్వహించిన కూనవరం ఎస్సైను ముఖ్యమంత్రి వైయస్.జగన్ ఇవాళ అభినందించారు. హెలిపాడ్ నుంచి కూనవరంలో వరద బాధితులతో ఏర్పాటు చేసిన సభకు హాజరవుతున్న సందర్భంలో ఒక విజ్ఞాపనకోసం సీఎం బస్సుదిగారు. అదే సమయంలో అక్కడున్న స్థానికుల అధికారులు కూనవరం ఎస్సై బాగా పనిచేశారని సీఎం జగన్ కు చెప్పారు.

అదే సమయంలో స్థానిక ఎస్సై వెంకటేష్ రెస్క్యూ ఆపరేషన్ సాహసోపేతంగా నిర్వహించారని, గత ఏడాది భీకరంగా వచ్చిన గోదావరి వరదల్లో కూనవరం సమీపంలోని దాదాపు 4-5వేలమంది గ్రామస్తులను తరలించడంలో కీలకపాత్ర పోషించారని సీఎం ఎదుట మెచ్చుకున్నారు. అదే సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న వెంకటేష్ను సీఎం భుజం తట్టి అభినందించారు. అంతే కాదు ఆయనకు మెడల్ ఇవ్వాలంటూ కూడా సిఫార్సు చేశారు. దీంతో వెంకటేష్ కూడా సంతోషంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications