ఏపీలో చర్చ మొదలైంది
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఘాటు విమర్శలు సంధించారు.
కూటమి ప్రభుత్వం ప్రతి అడుగులో మోసమే కనిపిస్తోందని వైఎస్ జగన్ అన్నారు. అధికారంలోకి రావడానికి చంద్రబాబు ప్రజలకు ఎన్నో ఆశలు చూపించారని, సూపర్ 6 పేరుతో మోసగించాడని విమర్శించారు. అందలం ఎక్కాక ప్రజలను ఇప్పుడు హామీలను అమలు చేయలేమంటూ చేతులెత్తేశాడని ధ్వజమెత్తారు.

మాడుగుల నియోజకవర్గ ఎంపీటీసీలు, జడ్పీటీసీలతో తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడారు. ఎన్ని ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినప్పటికీ.. తమ ప్రభుత్వం ఎలాంటి సాకులు చూపలేదని వైఎస్ జగన్ గుర్తు చేశారు. మాట తప్పుకుండా మేనిఫెస్టోనే అమలు చేశామని పేర్కొన్నారు.
మేనిఫెస్టోను భగవద్గీత, బైబిల్, ఖురాన్లా భావించామని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకోసం కట్టుబడి పనిచేశామని, ప్రతి ఇంటికీ మంచి చేశామని అన్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ మంచే శ్రీరామ రక్ష అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. చంద్రబాబు చేస్తోన్న మోసాలు ప్రజల ఆగ్రహానికి దారితీస్తాయని పేర్కొన్నారు.
వైఎస్ జగన్.. ముఖ్యమంత్రిగా ఉండి ఉంటే ఇప్పటికే రైతు భరోసా, స్కూళ్లకు వెళ్తున్న ప్రతి పిల్లాడి తల్లులకు అమ్మ ఒడి, సున్నావడ్డీ, విద్యాదీవెన కింద ఫీజురియింబర్స్ మెంట్, వసతి దీవెన, మత్స్యకార భరోసా, వాహన మిత్ర, నేతన్న నేస్తం.. వంటి పథకాల కింద నిధులు లబ్దిదారులకు అందేవని, ఈ చర్చ ప్రజల్లో మొదలైందని జగన్ అన్నారు.
ప్రతి సంవత్సరం ఆగస్టు నెలాఖరు లోపలే వాటిని మంజూరు చేశామని జగన్ చెప్పారు. తమ ప్రభుత్వం లేకపోవడతో ఇవేమీ అమలు కావట్లేదని, ఇంటికే వచ్చి పథకాలు అందించే పరిస్థితి లేదని అన్నారు. జన్మభూమి కమిటీలు చుట్టూ, తెలుగుదేశం నాయకుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.
స్కూళ్లల్లో టోఫెల్ పీరియడ్ను ఎత్తేశారని జగన్ అన్నారు. విద్యారంగాన్ని నిర్వీర్యం చేస్తోన్నారంటూ ధ్వజమెత్తారు. విద్యాకానుక పంపిణీ అస్తవ్యస్తమైందని, ట్యాబులు కూడా ఇస్తారన్న నమ్మకం లేదని చెప్పారు. మధ్యాహ్న భోజనంలో ప్రతిరోజూ ఒక మెనూ కూడా ఏ మాత్రం అమలు కావట్లేదని పేర్కొన్నారు.
ఇంగ్లిషు మీడియం చదువులు అటకెక్కే పరిస్థితి నెలకొందని, ఆరోగ్య శ్రీ కింద ఒక్కపైసా ఇవ్వట్లేదని, ఇప్పటికే 1,600 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని జగన్ అన్నారు. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయని, రెడ్బుక్ పాలన నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. కక్ష తీర్చుకునే వారిని చంద్రబాబు మరింత పోత్సహిస్తోన్నారంటూ ఆరోపించారు.
కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసాలన్నింటినీ ప్రజల్లో చూస్తోన్నారని, వారిలో ఆగ్రహం మొదలవుతోందని జగన్ అన్నారు. మళ్లీ వైఎస్ఆర్సీపీ ఘన విజయాన్ని సాధిస్తుందనే ధీమాను వ్యక్తం చేశారాయన. ఈ అయిదు సంవత్సరాల్లో పార్టీ నాయకులను వేధింపులకు గురి చేస్తారని, ఎంతగానో కష్టపెడతారని మండిపడ్డారు. 16 నెలలు జైలు శిక్షే దీనికి నిదర్శనమని చెప్పారు.












Click it and Unblock the Notifications