రైతుల నుంచి ఫిర్యాదులొస్తే ఊరుకోను-వ్యవసాయ సమీక్షలో జగన్- ఈ క్రాపింగ్ సక్సెస్
వ్యవసాయ, పౌరసరఫరాల శాఖలపై సీఎం జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఇందులో ఖరీఫ్ రైతుల నుంచి ధాన్యం కొనుగోళ్లు, రబీ సీజన్ కు ఏర్పాట్లు, ఈ-క్రాపింగ్, సాయిల్ డాక్టర్ విధానం వంటి పలు అంశాలు చర్చకు వచ్చాయి. అధికారులు తాజా పరిస్దితుల్ని గణాంకాలతో సహా సీఎంకు వివరించారు. అనంతరం సీఎం జగన్ వారికి పలు కీలక సూచనలు చేశారు. సమీక్షలో ప్రస్తావనకు వచ్చిన అంశాలివే..

పంటలపై జగన్ సమీక్ష
ఖరీఫ్ లో ఇప్పటిదాకా 1.10 ఎకరాల్లో రైతులు పంటలు వేశారు. ఇంకా అక్కడక్కడా నాట్లు కొనసాగుతున్నాయి.
సాధారణ సాగు 1.15 కోట్ల ఎకరాలకు ఈ సీజన్లో చేరుకోనుందని సీఎంకు ఇవాళ జరిగిన సమీక్షలో అధికారులు వివరించారు. గత మూడేళ్లలో 3.5లక్షల ఎకరాల్లో ఉద్యానవనసాగు పెరిగిందన్నారు. దీంతో సాధారణ పంటలనుంచి ఉద్యానవన పంటలవైపు రైతులు మళ్లుతున్నారని అధికారులు తెలిపారు. రబీ సీజన్ కు సన్నద్ధంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. 57.31లక్షల ఎకరాల్లో రబీ సాగు విస్తీర్ణంగా అంచనా వేస్తున్నామని, ఇందుకోసం 96లక్షల మెట్రిక్ టన్నుల విత్తనాలు సిద్ధంచేశామని సీఎంకు అధికారులు వివరించారు. ఆ తర్వాత ఇ-క్రాపింగ్ జరుగుతున్న తీరును వివరించారు. సాగుచేసిన పంటల్లో వీఏఏ, వీఆర్ఓలు 99 శాతానికిపైగా ఆధీకృతం చేసే ప్రక్రియ పూర్తిచేశారన్నారు. ఈ నెల 15వ తేదీలోగా రైతుల అథంటికేషన్ కూడా పూర్తిచేసి, వారికి డిజిటల్, ఫిజికల్ రశీదులు కూడా ఇవ్వాలని సీఎం ఆదేశించారు. అనంతరం పకడ్బందీగా సోషల్ఆడిట్ కూడా పూర్తిచేయాలన్నారు. నిర్దేశిత గడువు ప్రకారం ఈ ప్రక్రియను పూర్తిచేయాలన్నారు.

ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై సమీక్ష
అనంతరం ఖరీఫ్ ధాన్యం కొనుగోళ్లపై సీఎం సమీక్ష చేశారు. ఇప్పటిపరకూ రైతులు 14.10 లక్షల హెక్టార్లలో వరి పండించారని అంచనా వేశారు. దీంతో నవంబరు మొదటివారం నుంచి కొనుగోళ్లు చేయడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసినట్లు అధికారులు సీఎంకు తెలిపారు. ధాన్యం కొనుగోళ్లకోసం 3,423 ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు చేశామన్నారు. మాయిశ్చరైజర్ మీటర్, అనాలసిస్ కిట్, హస్క్ రిమూవర్, పోకర్స్, ఎనామెల్ ప్లేట్స్, జల్లించే పరికరాలతో సహా వీటన్నింటినీ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ-క్రాపింగ్ చేయడం వల్ల ధాన్యం కొనుగోళ్లలో పూర్తిస్థాయిలో పారదర్శకత వచ్చిందని ఈ సందర్భంగా సీఎం జగన్ తెలిపారు.

రైతుల ఫిర్యాదులపై జగన్
గిట్టుబాటు ధర కన్నా తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చిందని ఏ రైతు కూడా ఎక్కడా ఫిర్యాదు చేయకూడదని సీఎం అధికారులకు సూచించారు. ఇందుకోసం గన్నీబ్యాగులు, కూలీలు, రవాణా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ధాన్యం కొనుగోళ్లలో సాయం కోసం తీసుకుంటున్న వారిని రైతు సహాయకులుగా వ్యవహరించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై రైతులకు అవగాహన కల్పించాలని సీఎం ఆదేశించారు. రైతు భరోసా కేంద్రాల్లో ఈ మేరకు రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ధాన్యం కొనుగోళ్లపై ఆర్బీకేల్లో పోస్టర్లుకూడా పెట్టాలన్నారు. రాష్ట్రంలో విస్తారంగా వరి సాగు అవుతున్నందున బియ్యం ఎగుమతులపైనా దృష్టిపెట్టాలన్నారు.
దేశీయంగా డిమాండ్ లేని పరిస్థితుల్లో విదేశాలకు ఎగుమతిచేసే అవకాశాలపైనా దృష్టిపెట్టాలన్నారు. ఈ విషయంలో ఎగుమతులు రంగంలో ఉన్న ఇతర కంపెనీలతో కలిసి పనిచేయాలని సీఎం సూచించారు. ఇది రైతులకు ఉభయతారకంగా ఉంటుందన్నారు.

బ్రోకెన్ రైస్ తో ఇథనాల్ తయారీ
అలాగే బ్రోకెన్ రైస్ను ఇథనాల్ తయారీకి వినియోగించడంపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. ఇప్పటికే ఇఫ్కో ద్వారా ఒక ప్లాంటు, మహీంద్రా ద్వారా మరో ప్లాంటు నుంచి ఇథనాల్ తయారీ కాబోతుందని తెలిపారు. రంగు మారిన ధాన్యం, బ్రోకెన్ రైస్ నుంచి ఇథనాల్ తయారీపై దృష్టి పెట్టాలన్నారు. ఎక్కడైనా పంటలకు ఎంఎస్పీ కన్నా తక్కువ వస్తుందని అంటే.. కచ్చితంగా జోక్యంచేసుకుని ఎంఎస్పీ ధరలకు కొనుగోలు చేయాలన్నారు. ఎక్కడైనా ధర రాని పక్షంలో, సీఎంయాప్ ద్వారా ఫిర్యాదు రాగానే రైతును ఎలా ఆదుకుంటామనే విషయంలో ఎస్ఎల్ఏ పకడ్బందీగా ఉండాలని సీఎం తెలిపారు. కొనుగోలు చేసిన సరుకును నిల్వచేసే ప్రాంతంలో జియోఫెన్సింగ్, అలాగే ఉత్పత్తులకు క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుందని అధికారులు తెలిపారు. ఇదే తరహా విధానాన్ని పౌరసరఫరాలశాఖలో కూడా పాటించాలని సీఎం సూచించారు.

కొత్తగా ఆర్బీకే మిత్రలు
రైతులను ఆదుకునేందుకు మార్కెట్లో నిరంతరం జోక్యం చేసుకోవాలన్నారు. దీనివల్ల ధరలు పతనం కాకుండా రైతులకు మేలు జరుగుతుందన్నారు. అక్టోబరు 17న ఈ ఏడాది రైతు భరోసా రెండోవిడతకు అన్నిరకాలుగా సిద్ధం అవుతున్నట్లు తెలిపారు. వైయస్సార్ యంత్రసేవకు సంబంధించిన పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచామన్నారు.
ఆర్బీకేల్లో అందుబాటులో ఉన్న యంత్రాలు, వాటి సేవలకు అయ్యే ఖర్చు తదితర వివరాలతో పోస్టర్లను ఆర్బీకేల్లో ఉంచామని అధికారులు సీఎంకు తెలిపారు. ఈ సందర్భంగా ఆర్బీకేల్లో సేవలందిస్తున్న వారిని ఆర్బీకే మిత్రలుగా వ్యవహరించాలని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. .

సాయిల్ డాక్టర్ విధానంపై జగన్
అలాగే సాయిల్ డాక్టర్ విధానంపై సమావేశంలో చర్చ జరిగింది. ఖరీఫ్ ప్రారంభం కాకముందే మార్చి, ఏప్రిల్, మే నెలల్లో భూసార పరీక్షలు పూర్తికావాలని సీఎం జగన్ ఆదేశించారు. ప్రతి ఏటా కూడా ఇలాగే పరీక్షలు చేయాలన్నారు. దీనికి సంబంధించిన వివరాలను సంబంధిత కార్డులో రికార్డు చేయాలన్నారు. భూసార పరీక్ష ఫలితాలను పరిగణలోకి తీసుకుని ఎలాంటి పంటలు వేయాలి? ఎంత మోతాదులో ఎరువులు వేయాలన్న దానిపై రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, పంటల సాగుకు సంబంధించి సిఫార్సులు చేయాలన్నారు. ఈ విధానాన్ని పటిష్టంగా అమలు చేయడం కోసం దేశంలో ప్రసిద్ధ చెందిన బాంబే ఐఐటీ, కాన్పూర్ ఐఐటీలో కొన్ని సాంకేతిక విధానాలను పరిశీలించామని అధికారులు సీఎంకు తెలిపారు. ప్రతి ఆర్బీకేలో సాయిల్ టెస్టింగ్ డివైజ్ పెట్టాలన్నారు. దీనివల్ల విచక్షణ రహితంగా ఎరువులు, రసాయనాల వాడకం తగ్గుతుందన్నారు. తద్వారా రైతులకు పెట్టబడులుతగ్గి, ఖర్చులు తగ్గుతాయన్నారు. అంతేకాక మంచి వ్యవసాయ ఉత్పత్తులను సాధించడానికి అన్నిరకాలుగా ఈ విధానం ఉపయోగపడుతుందన్నారు.












Click it and Unblock the Notifications