జగన్ పాదయాత్ర, ఎన్టీఆర్పై వైసీపీ ఎమ్మెల్యే ప్రశంసలు: వరుసగా అలకలు
భారత దేశంలో బీసీలకు అండగా ఉన్న నాయకులు కేవలం ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలు మాత్రమేనని వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు.
కడప: భారత దేశంలో బీసీలకు అండగా ఉన్న నాయకులు కేవలం ఎన్టీఆర్, వైయస్ రాజశేఖర రెడ్డిలు మాత్రమేనని వైసీపీ నెల్లూరు ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా జగన్ సోమవారం ఏడో రోజు పాదయాత్ర చేస్తున్నారు. ఇందులో భాగంగా మైదుకూరులో బీసీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు.
Recommended Video
రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోందని అనీల్ మండిపడ్డారు. బీసీలు అందరూ ఒక్కటి గుర్తు పెట్టుకోవాలని, మన పిల్లలు ఫీజు రీయింబర్సుమెంట్స్ వల్ల లాభపడ్డారని గుర్తుంచుకోవాలన్నారు. నేడు మన పిల్లలు ఉన్నత స్థానాల్లో ఉన్నారంటే అందుకు వైయస్ కారణం అన్నారు.
జగన్ను సీఎంను చేస్తే 45 ఏళ్లకే పింఛన్
చంద్రబాబు బీసీలను వాడుకుంటున్నారని అనీల్ కుమార్ ధ్వజమెత్తారు. జగన్ను సీఎం చేస్తే 45 సంవత్సరాలకే పింఛన్ వస్తుందని, మన పిల్లలు 10వ తరగతి పూర్తి చేసే వరకూ ప్రతి ఏడాది రూ.15 వేలు వస్తుందని చెప్పారు.
సత్తా చాటుదాం
బీసీల కష్టసుఖాలు తెలుసుకునేందుకు జగన్ ఓ కమిటీని వేశారని అనిల్ కుమార్ అన్నారు. బీసీల కష్ట సుఖాలు తెలుసుకొని మేనిఫెస్టో తయారు చేద్దామన్నారు. 2019లో చంద్రబాబుకు బీసీ దమ్ము చూపిద్దామన్నారు.
విభేదాల వల్లే రాలేదు
కాగా, జగన్ పాదయాత్రలో అలకలు కనిపిస్తున్నాయి. ఆదివారం తన సొంత మండలమైన దువ్వూరు మండల కేంద్రంలో జగన్ పర్యటన, ప్రసంగం సందర్భంగా వైసీపీ నేత, డీసీసీబీ మాజీ చైర్మన్ తిరుపాల్ రెడ్డి, కనిపించకపోవడానికి వైసీపీలో విభేదాలే కారణమని అంటున్నారు.
అంతకుముందు రాచమల్లు ప్రసాద్ కూడా
ఆదివారం ఉదయం మునుపు నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా జగన్ను కలిసేందుకు వచ్చారు. వీరిని జగన్ వద్దకు తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ప్రయత్నించారు. కానీ జగన్ సమయం ఇవ్వలేదు. ఎమ్మెల్యే రాచమల్లును కూడా పట్టించుకోకుండా పాదయాత్రకు వెళ్లిపోయారు. దీంతో రాచమల్లు అలక వహించారు. ఆ తర్వాత ఎంపీ సర్ది చెప్పారు.