తిక్క ప్రశ్నలు వేస్తూ పోతే చెప్తూ..: మీడియాపై జగన్
హైదరాబాద్: మీడియా ప్రతినిధులపై వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ విసుగు ప్రదర్శించారు. "సంబంధం ఉన్న ప్రశ్నలు వేస్తే మంచిది, తిక్క తిక్క ప్రశ్నలు మీరు వేస్తూ పోతే, నేను చెప్తూ పోతే అసలు ఉద్దేశం దెబ్బ తింటుంది" ఆయన విసుక్కున్నారు. తాను చెప్పాల్సిన విషయాలు చెప్పిన తర్వాత మీడియా ప్రతినిధులు ప్రశ్నలు వేయడానికి ప్రయత్నించినప్పుడు రెండు ప్రశ్నలు మాత్రమే తీసుకుంటానని చెప్పారు. దాంతో మీడియా ప్రతినిధుల నుంచి ప్రశ్నలు వచ్చాయి. ఓ ప్రతినిధి వేసిన ప్రశ్నకు జగన్ పై విధంగా ప్రతిస్పందించి, లేచి వెళ్లిపోయారు.
కొత్తగా ఏర్పడే రెండు రాష్ట్రాల మధ్య జలాల పంపకంపై కేంద్ర మంత్రి జైరాం రూపొందించిన నివేదికపై మాట్లాడడానికి ఆయన శుక్రవారం సాయంత్రం మీడియా ప్రతినిధుల సమావేశం ఏర్పాటు చేశారు. జలాల సమస్య పరిష్కారానికి మండలి ఏర్పాటు చేయాలని జైరాం రమేష్ సూచించినట్లు వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు. మండలి ఏర్పాటును ఆయన తీవ్రంగా తప్పు పట్టారు. కర్ణాటక, మహారాష్ట్రలతో నీటిని పంచుకోవడానికి లేని మండలి మన రాష్ట్రానికే ఎందుకని జగన్ ప్రశ్నించారు. జల మండలి ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ప్రాజెక్టులు ఆగిపోతాయని ఆయన అన్నారు.
రాష్ట్ర విభజన వల్ల తలెత్తే సమస్యలకు నిమిషాల్లో పరిష్కారాలు చూపిస్తున్నారని ఆయన వ్యాఖ్యానిచారు. వారం తిరగకముందే పరిష్కారాలు చూపిస్తున్నారని, బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారని, ఓట్లు సీట్లు మాకు కావాలి.. మీ చావు మీరు చావండి అనే పద్ధతిలో వ్యవహరిస్తున్నారని ఆయన కాంగ్రెసును విమర్శించారు. జీవోఎంతో సమావేశానికి తమ పార్టీ నేత మైసురారెడ్డిని పంపిస్తానని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని చెప్పాలని సూచిస్తానని, గడ్డి పెట్టి రావాలని చెప్తానని ఆయన అన్నారు.
జల మండలి ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ప్రాజెక్టులు శూన్యమవుతాయని ఆయన అన్నారు. విభజనపై రోజుకో లీకు ఇస్తున్నారని ఆయన అన్నారు. కనీవినీ ఎరుగని రీతిలో రాష్ట్రాన్ని విడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన అన్నారు. విభజన అంటూ ప్రారంభమైతే ఈ రాష్ట్రంతో ఆగిపోదని, వాళ్లు బలహీనంగా ఉన్న ప్రతి రాష్ట్రాన్ని విడగొడుతారని ఆయన అన్నారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా దేశంలోని అన్ని పార్టీల మద్దతు కూడగడుతామని ఆయన అన్నారు. ఇందుకు గాను ఈ నెల 16వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఢిల్లీతో పాటు వివిధ రాష్ట్రాలకు వెళ్తామని ఆయన చెప్పారు.
రాష్ట్ర విభజనపై వైఖరి మార్చుకోవాలని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి సహకరించాలని బిజెపితో పాటు అన్ని రాజకీయ పార్టీలనూ కోరుతామని ఆయన చెప్పారు. ఈ నెల 26వ తేదీ నుంచి సమైక్యాంధ్ర నినాదంతో రాష్ట్ర పర్యటన చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.