ఏపీలో దంచికొడుతున్న వర్షాలు-అధికారులకు జగన్ కీలక ఆదేశాలు..
ఏపీలో వేసవిలో అకాల వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా పలు జిల్లాలు జల దిగ్బంధంలో చిక్కుకుంటున్నాయి. మరో రెండు రోజుల పాటు ఈ వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ అకాల వర్షాలతో సాధారణ ప్రజలతో పాటు రైతులు, వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున చేపట్టాల్సిన చర్యలపై ఇవాళ సీఎం జగన్ అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు.
రాష్ట్రంలో అకాల వర్షాలు, తదనంతర పరిస్థితులపై సీఎం వైయస్.జగన్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. విశాఖపట్నం పర్యటన నుంచి తిరిగి రాగానే ఆయన సీఎంఓ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్లతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.

అకాల వర్షాల కారణంగా తడిసిపోయిన ధాన్యం కొనుగోలుకు పౌరసరఫరాల శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షాల కారణంగా తడిసిన ధాన్యం ఉన్న రైతుల వద్దనుంచి వెంటనే ఈ ధాన్యాన్ని తీసుకునేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలన్నారు.
మరోవైపు హార్వెస్టింగ్ చేసి ఉన్న ధాన్యం ఎక్కడా ఉన్నా వర్షాల బారి నుంచి వాటిని కాపాడేందుకు చేపడుతున్న చర్యలను మరింత ముమ్మరంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారుల్ని జగన్ ఆదేశించారు. కొనుగోలు కేంద్రాలవద్ద కానీ, ఆర్బీకేల వద్దకాని, రైతుల వద్దకాని ఎక్కడ ధాన్యం నిల్వలున్నా వాటిని వెంటనే అందుబాటులోని గోడౌన్లకు, ఇతర ప్రభుత్వ భవనాల్లోకి తరలించాలని ఆదేశాలు జారీచేశారు. ధాన్యం ఎన్యుమరేషన్ ప్రక్రియను కూడా వీలైనంత త్వరగా పూర్తిచేయాలని సీఎం ఆదేశించారు.
సీఎం ఆదేశాలమేరకు ధాన్యం తరలింపు కోసం రవాణా ఖర్చులకింద ప్రతి కలెక్టర్కూ రూ.1 కోటి రూపాయలను ఇప్పటికే కేటాయించామని, అధికారులు వాటిని వినియోగించుకుంటున్నామని సీఎంకు అధికారులు తెలిపారు. దీంతో ఇన్పుట్ సబ్సిడీని విడుదలచేసేందుకు అన్నిరకాల చర్యలు తీసుకోవాలని జగన్ సూచించారు.
ప్రస్తుతం వర్షాలు, పంట విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రతి జిల్లాకు ఒక వ్యవసాయ శాస్త్రవేత్తద్వారా రైతులకు అవగాహన కల్పించే చర్యలను చేపడుతున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. చేలల్లో ఉన్న మొక్కజొన్నను వెంటనే కొనుగోలు చేసేందుకు మార్క్ఫెడ్ అధికారుల ద్వారా చర్యలు తీసుకుంటున్నట్టు ముఖ్యమంత్రికి తెలిపారు. వర్షాలు తగ్గగానే పంట నష్టపోయిన చోట రైతులకు అండగా నిలవడానికి సీఎం ఆదేశాల మేరకు విత్తనాలు పంపిణీచేస్తామన్నారు.












Click it and Unblock the Notifications