మళ్లీ ఢిల్లీ నుంచే జగన్ పోరాటం మొదలు
YS Jagan Mohan Reddy: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తరువాత రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న పరిణామాలు, అవాంఛనీయ పరిస్థితులపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి యుద్ధం ప్రకటించారు.
పల్నాడు జిల్లా వినుకొండలో మూడు రోజుల కిందట నడిరోడ్డుపై దారుణ హత్యకు గురైన పార్టీ కార్యకర్త షేక్ రషీద్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ పాలనలో రాష్ట్రంలో నెలకొన్న అరాచకాలకు నిరసనగా ఈ నెల 24వ తేదీన దేశ రాజధానిలో ధర్నా చేస్తామని ప్రకటించారు.

పార్టీకి చెందిన లోక్సభ, రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ ఇందులో పాల్గొననున్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన ఈ నెలన్నర రోజుల వ్యవధిలో రాష్ట్రంలో సంభవించిన దాడులు, హత్యలు, చిన్ని పిల్లలపై అత్యాచారాలపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వివరిస్తామని చెప్పారు.
ఈ ప్రకటన- జగన్ పాత రోజులను గుర్తు చేసినట్టయింది. ఆయన రాజకీయ జీవితానికి ఆరంభమైంది అక్కడి నుంచే. పోరాటాలకు బీజం పడిందీ ఢిల్లీ లోనే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్థాపించడానికి ముందు- ఆ తరువాతా జగన్ రాజకీయాలన్నీ ఢిల్లీ కేంద్ర బిందువుగానే సాగాయి.
మొదట్లో కాంగ్రెస్లో కొనసాగిన జగన్.. ఆ తరువాత ఆ పార్టీ నుంచి బయటికి వచ్చిన విషయం తెలిసిందే. ఓదార్పు యాత్ర నిర్వహించడానికి అనుమతి కోసం అప్పటి కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని ఢిల్లీలోనే కలిశారు జగన్. ఆమె అంగీకరించకపోవడంతో కాంగ్రెస్కు గుడ్ బై చెప్పాలనే నిర్ణయాన్నీ అక్కడే తీసుకున్నారు.
ప్రతిపక్ష నేతగా ప్రత్యేక హోదా కోసం పలువురు జాతీయ స్థాయి నాయకులను ఢిల్లీలో కలిసిన సందర్భాలు ఉన్నాయి. ఇదే డిమాండ్తో 2015 ఆగస్టులో ఢిల్లీలో నిరాహర దీక్షనూ చేపట్టారాయన. 67 మంది ఎమ్మెల్యేలతో జంతర్ మంతర్ వద్ద దీక్షను కొనసాగించారు.
ఇప్పుడు మళ్లీ ఆయన ఢిల్లీ గడప తొక్కబోతోన్నారు. రాష్ట్రంలో చోటు చేసుకుంటోన్న హత్యలు, అత్యాచారాలు, పార్టీ సానుభూతిపరులపై దాడుల గురించి అక్కడే అమీతుమీ తేల్చుకోనున్నారు. చంద్రబాబు- పవన్ కల్యాణ్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తొలి నెలన్నర రోజుల్లో జగన్ ఢిల్లీ స్థాయిలో ఉద్యమించబోతోండటం చర్చనీయాంశమౌతోంది.












Click it and Unblock the Notifications