418 కేజీల వెండితో సీఎం వైఎస్ జగన్ చిత్రపటం : జగన్ పై అభిమానం చాటుకున్న నెల్లూరు నుడా చైర్మన్ !!
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై వైసీపీ నేతలు వినూత్నంగా తమ అభిమానం చాటుకుంటున్నారు. గతంలో ఓ ఎమ్మెల్యే గుడి కడితే, ఇప్పుడు మరో వైసీపీ నేత వెండితో చిత్రపటాన్ని రూపొందించి తన ప్రేమను వ్యక్తం చేశారు. తన అభిమానాన్ని వ్యక్తం చేస్తూ నెల్లూరు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ ప్రత్యేకమైన కానుకను సిద్ధం చేసారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన నాటి నుండి ప్రజా సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి పై అభిమానంతో ఆయన జగన్ చిత్రపటాన్ని వెండితో కళాత్మకంగా తయారు చేయించటానికి శ్రీకారం చుట్టారు.

418 కిలోల వెండి పట్టీలతో సీఎం జగన్ భారీ చిత్రపటం .. జగన్ పై నెల్లూరు నేత ప్రేమ
వెండితో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రపటంతో అందరిని ఆశ్చర్యపరిచారు. నమూనాను తయారు చేయించి వెండి ఆభరణాలతో తీర్చిదిద్దారు. జగన్ చిత్రపటం తయారీకి కోయంబత్తూరు నుండి ప్రత్యేక నిపుణులను పిలిపించి మరీ అద్భుతంగా నమూనాను రూపొందించారు. ఏకంగా 418 కిలోల వెండి ఆభరణాలతో సీఎం జగన్మోహన్ రెడ్డి చిత్రాన్ని రూపొందించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. దీనిని రూపొందించిన ఆర్ట్ డైరెక్టర్ సురేష్ తో చైర్మన్ ద్వారకనాథ్ తన ఆలోచనలను పంచుకోవటంతో వెండి పట్టీలతో చాలా కళాత్మకంగా సీఎం జగన్ ప్రతిరూపాన్ని తయారు చేశారు .

వెండి పట్టీలతో జగన్ నమూనాను ఆవిష్కరించిన మంత్రి అనీల్ కుమార్ యాదవ్
దాదాపు పన్నెండు గంటలపాటు శ్రమించి దీనిని కళాకారులు రూపొందించారు. మహా నాయకుడికి మనఃపూర్వకంగా అంటూ సీఎం జగన్ పై తమ అభిమానాన్ని చాటుకుంటూ నుడా చైర్మన్ రూపొందించిన ఈ చిత్రం పలువురి ప్రశంసలు అందుకుంటుంది. సిద్ధం చేసిన సీఎం జగన్ నమూనాను ఇవాళ నెల్లూరులోని ఇరిగేషన్ క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ఆవిష్కరించారు. ఇక ఈ సందర్భంగా మాట్లాడిన నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ సీఎం జగన్ తనకు భగవంతుడితో సమానమని, అందుకే ఆయనపై తమకున్న అభిమానాన్ని వ్యక్తం చేసేలా అందరి కంటే విభిన్నంగా ఆలోచించి వెండి పట్టీలతో సీఎం చిత్రపటాన్ని తయారు చేశామని ఆయన పేర్కొన్నారు.

ద్వారకానాథ్ కు మాటిచ్చి నిలుపుకున్న జగన్ ..
ప్రస్తుతం నెల్లూరు నుడా చైర్మన్ గా వున్న ముక్కాల ద్వారకానాథ్ గతంలో నెల్లూరు కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ గా పనిచేశారు. వైసిపి ప్రతిపక్షంలో ఉన్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర సందర్భంగా ద్వారకానాథ్ కు సీఎం జగన్ మోహన్ రెడ్డి తాను అండగా ఉంటానంటూ హామీ ఇచ్చారు. పార్టీ నేతల ముందు బహిరంగంగా చెప్పారు. ఇక ద్వారకానాథ్ కు ఇచ్చిన హామీ మేరకు సీఎం జగన్ మోహన్ రెడ్డి నుడా చైర్మన్ పోటీలో ఎంతమంది ఉన్నా, వారందరికీ కాకుండా ద్వారకానాథ్ కే పదవిని కట్టబెట్టారు.

జగన్ పై అభిమానంతో నిలువెత్తు వెండి చిత్రపటం
ఇచ్చిన మాటకు కట్టుబడే జగన్మోహన్ రెడ్డి పై, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంగా బాధ్యతలు చేపట్టి నుండి ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తూ పనిచేస్తున్న మహా నాయకుడు అంటూ కొనియాడుతూ 418 కిలోల వెండితో జగన్ చిత్రపటాన్ని రూపొందించి అందరినీ అబ్బుర పరిచారు ద్వారకానాథ్. గతంలో ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మీద అభిమానంతో చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఏకంగా జగన్ కు గుడి కట్టి తన అభిమానాన్ని చాటుకున్నాడు.

గతంలో జగన్ కు ఆలయం కట్టించిన వైసీపీ ఎమ్మెల్యే
జగన్ ఆలయంలో రైతు భరోసా, పెన్షన్లు , ఆరోగ్యశ్రీ, అమ్మ ఒడి లాంటి పథకాల పేరుతో భారీ స్థూపాలను కూడా నిర్మించి నవరత్నాల సృష్టికర్త జగన్మోహన్ రెడ్డి విగ్రహాన్ని ప్రతిష్టించి హంగామా సృష్టించారు. దాదాపుగా రెండు కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మాణం చేపట్టిన జగన్ ఆలయంలో 75 లక్షల రూపాయలు ఎమ్మెల్యే సొంత నిధులను వెచ్చించగా, మిగతా నిధులు వైసీపీ నేతలు, కార్యకర్తలు చందాలు వేసుకుని ఇచ్చినట్లుగా సమాచారం. ఈ ఆలయ నిర్మాణంలో పంచలోహ విగ్రహాలను వినియోగించారు. ఇక ఆలయం లోపల మొత్తం గ్లాస్ డిజైన్ తో తళ తళ మెరిసేలా ఏర్పాట్లు చేశారు.












Click it and Unblock the Notifications