స్నానం చేసి జగన్ ఆగ్రహం, అర్ధరాత్రి వరకు ఏపీ సీఎం: ప్రధాని భేటీకి కెసిఆర్, బాబు డుమ్మా
రాజమండ్రి: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి గోదావరి పుష్కర స్నానం ఆచరించారు. బుధవారం ఉదయం కొవ్వూరు గోష్పాద క్షేత్రంలో ఆయన గోదారమ్మ తల్లికి పూజలు చేశారు. వేదమంత్రోచ్ఛరణల మధ్య ఆయన స్నానం ఆచరించారు.
పుష్కర ఘాట్ వద్ద తన తండ్రి దివంగత వైయస్ రాజశేఖర రెడ్డికి జగన్ పిండ ప్రదానం చేశారు. అనంతరం ఆయన రాజమండ్రి చేరుకొని అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామి వారికి పూజలు చేస్తారు. ఆ తర్వాత ఉమామార్కెండేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శిస్తారు. కోటి లింగాల ఘాట్ను సందర్శిస్తారు.
గోదావరిలో పుష్కర స్నానం అనంతరం జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు 30 మంది భక్తులు చనిపోవడానికి కారణమయ్యాడని ఆరోపించారు. చంద్రబాబు తన పుష్కర స్నానం కోసం విఐపి ఘాట్ను కాకుండా సాధారణ జనం కోసం కేటాయించిన ఘాట్ను ఎంచుకున్న నేపథ్యంలో కోటగుమ్మం ప్రమాదం జరిగిందన్నారు.
మృతుల కుటుంబాలకు ఎంత నష్టపరిహారం ఇచ్చినా తక్కువే అన్నారు. చంద్రబాబు స్థానంలో ఎవరైనా ఉంటే జైలుకు పంపించేవారన్నారు. చంద్రబాబు చేసిన తప్పుకు విచారణ పేరుతో అధికారులను బలి చేయాలని చూస్తున్నారన్నారు. తప్పు కప్పిపుచ్చుకునే ప్రయత్నం జరుగుతోందన్నారు. భక్తులను ఇబ్బంది పెట్టకుండా ప్రముఖులు విఐపీ ఘాట్కు వెళ్లాలని జగన్ సూచించారు.
గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి, భద్రాచలంలకు భక్తులు రెండో రోజు కూడా మరింత పెరిగారు. రాజమండ్రిలో స్వరూపానందేద్ర స్వామి పుష్కర స్నానం ఆచరించారు. కాగా, చంద్రబాబు మంగళవారం అర్ధరాత్రి వరకు పుష్కర ఘాట్ల వద్ద కలియతిరిగారు. అధికార యంత్రాంగం చేసిన ఏర్పాట్లను పరిశీలించారు.
ప్రధాని నీతి అయోగ్ భేటీకి చంద్రబాబు డుమ్మా
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో జరగనున్న నీతి అయోగ్ కార్యక్రమానికి ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గైర్హాజరవుతునన్నారు. గోదావరి పుష్కరాల సందర్భంగా మంగళవారం జరిగిన విషాదం నేపథ్యంలో బాబు స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ కారణంగా ఆయన నీతి అయోగ్ భేటీకి హాజరు కావడం లేదు.
నీతి అయోగ్ భేటీకి 14 మంది ముఖ్యమంత్రులు గైర్హాజరవుతున్నారు. 9 మంది కాంగ్రెస్ ముఖ్యమంత్రులతో పాటు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, తెలంగాణ సీఎం కెసిఆర్, ఏపీ సీఎం చంద్రబాబు గైర్హాజరు అవుతున్నారు.