బ్లాక్మనీ తెల్లగా ఎలా మార్చాలంటే, బాబుపై టాడా కేసు: హెరిటేజ్ని లాగిన జగన్
విశాఖ: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం నాడు ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి వెంకయ్యల పైన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖ ఇందిరా ప్రియదర్శిని మైదానంలో వైసిపి నిర్వహించిన జై ఆంధ్రప్రదేశ్ సభలో ప్రసంగించారు.
2014 ఎన్నికలకు ముందు ఒక్కసారి వెళ్తే ఇదే వేదిక మీద నిలబడి చంద్రబాబు, మోడీ అందరు ఇక్కడి నుంచే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారన్నారు. చంద్రబాబు గుండె దద్దరిల్లేలా అందరూ జై సమైక్యాంధ్ర అనాలని సభకు వచ్చిన వారితో జగన్ నినదింప చేశారు.
ఇక్కడకు తాను ప్రసంగంతో ఊదరగొట్టేందుకు రాలేదన్నారు. నా ఆవేదన పంచుకునేందుకు వచ్చానని చెప్పారు. కొన్ని ప్రశ్నలతో, కొన్ని ఆలోచనలతో వచ్చానని చెప్పారు. మీరు కూడా ఆలోచన చేయాలన్నారు. రైతులు, విద్యార్థులు ఎవరూ సంతోషంగా లేరన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఎలాగు మంచి చేయలేదని, చేయదని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదన్నారు. ఆయన ఇచ్చిన హామీలు నెరవేర్చారా మీరు చెప్పాలని సభికులను ఉద్దేశించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా జగన్ పలు ప్రశ్నలు వేసి సభకు వచ్చిన వారి నుంచి సమాధానాలు రాబట్టారు.

చంద్రబాబు హామీ ఇచ్చినట్లు రుణమాఫీ జరిగిందా, ఏపీకి ఐదేళ్లు కాదు, పదేళ్లు ప్రత్యేక హోదా ఇస్తామన్నారు.. ఇచ్చారా, ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు ఇచ్చారా, ఉద్యోగం లేకుంటే నిరుద్యోగ భృతి అన్నారు, ఈ ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు నెలలు అవుతుంది, కాబట్టి ఇంటికి రూ.60వేలు రావాలి వచ్చాయా అని అడిగారు. బెల్టు షాపులు తీసేస్తామన్నారని, కానీ కనీసం తగ్గాయా అని అడిగారు. దానికి సభకు హాజరైన వారి నుంచి లేదు అని సమాధానం వచ్చింది.
2014 రాజకీయాల్లో అనుభవజ్ఞుడని ప్రజలు ఆయనకు అధికారం కట్టబెట్టారని, ఏపీ సువర్ణ ఆంధ్ర కాదు కదా, కరువు ఆంధ్ర అయిందని ఎద్దేవా చేశారు. ఏపీ ఆత్మహత్యల ప్రదేశ్గా మారిందన్నారు. తాను అధికారంలోకి వస్తే రుణమాఫీ చేస్తానని చంద్రబాబు చెప్పారని, కానీ మన ఖర్మ కొద్ది చంద్రబాబు సీఎం అయ్యారన్నారు.
ఇప్పుడు రైతులు అపరాధ వడ్డీ కడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఇప్పుడు ఏపీ ఆత్మహత్యల ప్రదేశ్గా మారిందని చెప్పేందుకు సిగ్గుపడుతున్నానని అన్నారు. సువర్ణాంధ్రప్రదేశ్ దేవుడెరుగు అని, కానీ ఈ రెండున్నరేళ్లలో అవినీతి ఏపీగా మారిందన్నారు.
ఏపీ అవినీతిలో నెంబర్ వన్ రాష్ట్రం అని ఎంసీఐ తెలిపిందన్నారు. ఇది తాను చెప్పడం లేదన్నారు. ఏపీలో గ్రోత్ రేట్ మద్యంలో కనిపిస్తోందన్నారు.
450 రేట్లు పెరిగిన హెరిటేజ్ షేర్, నల్లధనం ఎలా తెల్లగా మార్చుకోవాలంటే
చంద్రబాబు సీఎం అయ్యే నాటికి హెరిటేజ్ షేర్ విలువ రూ.200గా ఉందని, ఈ రెండున్నరేళ్లలో ఆ షేర్ విలువ రూ.900కు పెరిగిందన్నారు. అంటే 450 రేట్లు పెరిగిందన్నారు. చంద్రబాబు పాలనలో మిగిలిన డైరీలు అన్నీ నష్టాల్లో ఉంటాయని, హెరిటేజ్ మాత్రం లాభాల్లో ఉంటుందన్నారు.
ఎందుకో తెలియదు కానీ ఆయన డైరీ మాత్రం లాభాల్లో ఉంటుందన్నారు. నల్ల ధనాన్ని తెల్లధనంగా మార్చడం చంద్రబాబు నుంచి నేర్చుకోవాలన్నారు.
వైయస్ పాలనలో ఏపీ అంటే ఆరోగ్యాంధ్ర ప్రదేశ్ అన్నారు. ఈ రోజు ఆసుపత్రులు ధర్నాలు చేస్తున్నాయన్నారు. అయినా ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. వైయస్ హయాంలో రికార్డు ఇళ్లు కట్టారని, ఇప్పుడు మాత్రం దానికి రివర్స్ అన్నారు. అసలు కట్టిన ఇళ్లకు బిల్లులు రాకుండా గోడల లెవల్లో నిలిచిపోతున్నాయన్నారు.
హోదా కోసం ముందుండి పోరాటం చేయాల్సింది ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఉద్యోగాల విప్లవం బదులు చంద్రబాబు హయాంలో అవినీతి విప్లవం వచ్చిందన్నారు. ఇసుక నుంచి జెన్కో వరకు అక్రమాలు అన్నారు. ఆలయాల భూములను కూడా వదలడం లేదన్నారు.
ప్రపంచంలో చంద్రబాబు మాత్రమే కేసుల నుంచి తప్పించుకోగలరు!
ఒక సీఎం అవినీతి సొమ్మును సూటుకేసులో పెట్టుకొని ఓటుకు నోటులో దొరికినా అరెస్టు కాలేదంటే బహుశా చంద్రబాబు విషయంలో చూస్తామన్నారు. ప్రపంచంలో ఇలాంటివి ఎక్కడా జరగవన్నారు. ఓటుకు నోటు నుంచి బయటపడేందుకు చంద్రబాబు చేయని కుట్రలు లేవన్నారు.
అవకాశముంటే నేను, వెంకయ్యలం అమెరికాలో పుట్టేవాళ్లమని చంద్రబాబు అంటారని, నిజంగా రాష్ట్రం కోసం ఆయన పరితపిస్తే ఆ మాటలు మాట్లాడుతారా అని ప్రశ్నించారు.
ప్యాకేజీ ఇవ్వకున్నా
ఏపీకి కేంద్రం ఏ ప్యాకేజీ ఇవ్వకపోయినా, బ్రహ్మాండమైన ప్యాకేజీ ఇచ్చారని చెప్పడం విడ్డూరమన్నారు. ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశమే లేదని పుస్తకాలు పంపిణీ చేస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రే ప్రజలకు వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు. మన రాష్ట్రం కోసం పరితపించాల్సిన వ్యక్తి తన సొంత లాభాల కోసం మనలనే వెన్నుపోటు పొడుస్తున్నారన్నారు.
చంద్రబాబు తీరుతో రాష్ట్రమంతా నివ్వెర పోతోందన్నారు. ఒక తెలుగు వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. మరో తెలుగు వ్యక్తి కేంద్రమంత్రిగా (వెంకయ్య) ఉన్నారు. వీళ్లు కేసుల కోసం ఐదున్నర కోట్ల మంది ప్రజల గౌరవాన్ని తాకట్టు పెడుతున్నారన్నారు.
తెలుగుదేశం పార్టీ పుట్టిందే..
తెలుగువారి ఆత్మగౌరవం ఢిల్లీలో తాకట్టు పెట్టారని చెబుతూ తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించారన్నారు. ఇప్పుడు అదే టిడిపి తెలుగు ద్రోహుల పార్టీ అయిందన్నారు. దీనికి సిగ్గుతో తలవంచుకోవాలన్నారు. కేసుల నుంచి బయటపడేందుకు చంద్రబాబు నిస్సిగ్గు రాజకీయం చేస్తున్నారన్నారు.
ప్రత్యేక హోదా అంటే
మన గ్రామాలు బతకాలన్నా, మన పిల్లలకు సరైన ఉద్యోగాలు రావాలన్నా హోదా రావాల్సిందే అన్నారు. మన పిల్లలకు మన ప్రాంతంలోనే ఉద్యోగాలు రావడమే ప్రత్యేక హోదా అన్నారు. హోదా అంటే ఆకాశం నుంచి ఊడిపడటం కాదన్నారు. మన పిల్లలు మన రాష్ట్రంలో, మన జిల్లాలు, మన గ్రామాల్లో మంచి జీతాలతో ఉండటమే హోదా అన్నారు.
ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. ఇతర రాష్ట్రాల వారు మన వద్దకు రావడమే ప్రత్యేక హోదా అన్నారు. ఇలాంటి హోదా తేవాలని చంద్రబాబుకు లేదని, ఇవ్వాలని కేంద్రానికి లేదన్నారు.
మనది చేతులు కట్టుకొని కూర్చునే జాతి కాదు
ఇలాంటప్పుడు మనం చేతులు కట్టుకొని కూర్చోవాలా అని ప్రశ్నించారు. మన జాతి చేతులు కట్టుకొని కూర్చునేదేనా అన్నారు. చేతులు కట్టుకొని కూర్చోని ఉంటే, అదే జాతి మనది అయితే బ్రిటిష్ పాలనలోనే ఉండేవాళ్లమని, మద్రాసు రాష్ట్రంలో రెండో శ్రేణి పౌరులుగా ఉండేవాళ్లమన్నారు. ఈ రోజు మనం అడుగుతున్నది మన హక్కులను అన్నారు.
చంద్రబాబుపై టాడా కేసు పెట్టినా తప్పులేదు
చంద్రబాబు ప్రత్యేక హోదా అడగలేరని, పైగా పోరాడే వారిపై పీడీ యాక్టు పెడతామని బెదిరిస్తున్నారన్నారు. తనపై కేసుల మాఫీ కోసం ఐదు కోట్ల మంది ప్రజలను మోసగిస్తున్న చంద్రబాబు పైన టాడా కేసు పెట్టినా తప్పు లేదన్నారు. హోదా వల్లే ఉద్యోగాలు వస్తాయని, ప్రతి జిల్లా హైదరాబాద్ అవుతుందని, నో వేకెన్సీ బోర్డులు పోయి వాంటెడ్ బోర్డులు వస్తాయన్నారు. వెంకయ్య, చంద్రబాబు, జైట్లీ.. ఇలా అందరూ ఒక్కటై అబద్దాలు ఆడుతున్నారని, మోసాలు చేస్తున్నారన్నారు.
-
త్వరలోనే జగన్ పాదయాత్ర.. చంద్రబాబుకు రోజుకో సినిమా చూపిస్తారట! -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్ -
భారత్.. పాకిస్థాన్ లా 'బ్రోకర్' కాదు.. ఇచ్చిపడేసిన జై శంకర్..












Click it and Unblock the Notifications