ముల్లును ముల్లుతోనే తీయబోతున్న జగన్? పవన్ కు చెక్ పెట్టేలా భారీ స్కెచ్!
ఏపీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలు అన్ని పార్టీలకు చావోరేవోగా మారిపోయాయి. అధికారం నిలబెట్టుకునేందుకు వైసీపీ చేస్తున్న ప్రయత్నాలకు టీడీపీ-జనసేన నుంచి ఎదురవుతున్న ప్రతిఘటన ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుమార్పులు తెచ్చేలా ఉంది. ముఖ్యంగా గత నాలుగేళ్లలో పవన్ కళ్యాణ్ రాజకీయంగా బలపడటం, కాపులు ఆయన వెనుక క్యూ కట్టడం ఖాయమన్న అంచనాల నేపథ్యంలో సీఎం జగన్ వ్యూహం మార్చారు.
నిన్న మొన్నటివరకూ పవన్ కళ్యాణ్ ను ఓ దశా దిశా లేని రాజకీయ నాయకుడిగా, పార్ట్ టైమ్ పొలిటీషియన్ గానే భావించి లైట్ తీసుకున్న సీఎం జగన్ ఇప్పుడు ఎన్నికల వేళ ఆ సాహసం చేయలేకపోతున్నారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఈసారి పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ కచ్చితంగా ఉండబోతోందన్న నిఘా నివేదికలతో జగన్ అప్రమ్తతం అయ్యారు. దీంతో ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ప్రభావం చూపేలా సరికొత్త వ్యూహం రెడీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రభావాన్ని ఈ నాలుగు ఉమ్మడి జిల్లాల్లో చెక్ పెట్టేలా సీఎం జగన్ కొత్త ఏడాదిలో కొత్త ప్లాన్ సిద్దం చేశారు.

ఇందులో భాగంగా గోదావరి జిల్లాల్లో పవన్ కు కౌంటర్ గా ఆయన సామాజిక వర్గానికే చెందిన ముద్రగడ పద్మనాభాన్ని రంగంలోకి దించబోతున్న సీఎం జగన్, కృష్ణా-గుంటూరు బెల్ట్ లోనూ వంగవీటి రాధాను ఎంచుకున్నారు. వీరిద్దరిని త్వరలోనే వైసీపీలోకి రప్పించడంతో పాటు వారికి టికెట్లు కూడా ఇచ్చేలా ప్లాన్ రెడీ చేశారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే ముద్రగడతో పాటు ఆయన కుమారుడు చల్లారావు(గిరిబాబు), వంగవీటి రాధా త్వరలోనే వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నారు. ఆ తర్వాత వారికి టికెట్లను ప్రకటిస్తారు.
తాజాగా అంచనాల ప్రకారం ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరాక ఆయన కుమారుడు గిరిబాబును కాకినాడ ఎంపీగా లేకపోతే ప్రత్తిపాడు, పిఠాపురంలో ఓ చోట ఎమ్మెల్యేగా అవకాశం కల్పిస్తారు. అలాగే వంగవీటి రాధా కోసం విజయవాడ సెంట్రల్ సీటు రిజర్వు చేసినట్లు తెలుస్తోంది. ఈ రెండు మార్పులతో పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్ ను వైసీపీ బలంగా ఎదుర్కొనేలా జగన్ స్కెచ్ రెడీ చేస్తున్నారు. పవన్ సామాజిక వర్గం కాపులకు చెందిన ముద్రగడ ఫ్యామిలీ, వంగవీటి రాకతో కచ్చితంగా ఈసారి కాపు మొగ్గు వైసీపీకే ఉండేలా స్కెచ్ రెడీ చేస్తున్నారు. తద్వారా ముల్లును ముల్లుతోనే తీసే వ్యూహానికి జగన్ పదునుపెడుతున్నారు.












Click it and Unblock the Notifications