జగన్ యాక్షన్ ప్లాన్ సిద్దం - ఇక జనంలోనే..!!
ఏపీలో కొత్త రాజకీయం మొదలైంది. కొత్త ప్రభుత్వం పాలన మొదలైంది. 11 సీట్లకే పరిమితమైన జగన్ పార్టీ భవిష్యత్ పైన ఫోకస్ చేసింది. జగన్ ఎన్నికల్లో ఘోర ఓటమి పైన సమీక్ష చేస్తున్నారు. ఇప్పటికే దీనికి కారణాల పైన ఆరా తీసారు. ఓటమి చెందినా ప్రజలతోనే ఉండాలని నిర్ణియించారు. గత అయిదేళ్ల కాలంలో జరిగిన పొరపాట్లను సరి చేసుకొనే ప్రక్రియ ప్రారంభించారు. అందులో భాగంగా కీలక నిర్ణయాలను ప్రకటించేందుకు జగన్ సిద్దమయ్యారు.
జగన్ కీలక భేటీ
వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం గురువారం నిర్వహించనున్నారు. ఈ నెల 21న అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా మాజీ సీఎం జగన్ కార్యక్రమాల్లో పలు మార్పులు జరిగాయి. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో విస్తృత స్థాయి సమావేశాన్ని పార్టీ ముందుకు జరిపింది. ఇటీవల ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యేలు, పోటీ చేసిన అభ్యర్థులు ఈ సమావేశానికి హాజరవుతారు. అలాగే పార్లమెంట్ నియోజకవర్గాల్లో పోటీచేసిన అభ్యర్థులు (ఎంపీలు మినహా) ఈ సమావేశానికి హాజరవుతున్నారు. పార్టీ అధ్యక్షుడు వీరికి దిశానిర్దేశం చేయనున్నారు.

పార్టీ నేతలకు నిర్దేశం
జగన్ ఇప్పటికే పార్టీ ముఖ్యులతో వరుస సమావేశాలు నిర్వహించారు. వైసీపీ ఓడినా 40 శాతం..కోటి 32 లక్షల ఓట్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కొత్త ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు హామీలు అమలు చేస్తామని చెబుతున్నారని..వేచి చూద్దామని పార్టీ నేతలకు సూచించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలని జగన్ డిసైడ్ అయ్యారు. సభలో సంఖ్య పరంగా వైసీపీకి ప్రతిపక్ష హోదా దక్కలేదు. అయితే, మూడు పార్టీల కూటమి అధికర పక్షం కావటంతో..వైసీపీ విషయంలో స్పీకర్ నిర్ణయం కీలకం కానుంది.
జనంలోకి జగన్
సభలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని జగన్ అంచనా వేస్తున్నారు. అయినా, సభకు హాజరై పార్టీ వాయిస్ వినిపించే ప్రయత్నం చేద్దామని వెల్లడించారు. ఇక..ఎన్నికల ఫలితాల తరువాత పార్టీ కేడర్ పైన జరిగిన దాడుల్లో గాయపడిన వారిని పరామర్శించాలని జగన్ నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల తరువాత క్షేత్ర స్థాయి పర్యటనకు సిద్దమవుతున్నారు. కడప జిల్లా నుంచి పార్టీ కేడర్ తో వరుస సమావేశాలకు నిర్ణయించారు. ప్రభుత్వం హామీల అమలు..తీసుకొనే నిర్ణయాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు వ్యూహాలు సిద్దం చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. ఈ రోజు జరిగే సమావేశంలో పార్టీ కేడర్ కు జగన్ నిర్దేశించే కార్యాచరణ ఏంటనేది ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications